మోడీకి విదేశీ అభినందనలు షురూ! మొదటగా శుభాకాంక్షలు చెప్పినదెవరంటే..?
న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ను బట్టి చూస్తే.. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల కంటే అధిక సీట్లలో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తేలింది. దీనితో ఆయనకు వివిధ దేశాధినేతల నుంచి అభినందలు అందుతున్నాయి. మొట్టమొదటగా- చైనా దేశాధ్యక్షుడు గ్జి జిన్పింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజధాని బీజీంగ్లో ఓ ప్రకటన విడుదల చేశారు.
17వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నానని జిన్పింగ్ తెలిపారు. భారత్, చైనాలు అభివృద్ధి చెందిన అతిపెద్ద దేశాలని ఆయన అన్నారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాయని చెప్పారు. చైనా- భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని ఆయన అన్నారు.
చైనా, భారత్ మధ్య అంతర్జాతీయ సంబంధాల విషయంలో చక్కని సమన్వయం, సహకారం, సుహృద్భావ వాతావరణం నెలకొని ఉందని, దీన్ని కొనసాగిస్తామని జిన్పింగ్ అన్నారు. దౌత్యపరమైన అంశాలను పరస్పర అవగాహనతో బలోపేతం చేసుకుంటామని చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జపాన్ ప్రధానమంత్రి షిన్జో అబే, ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు, శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె, ఆఫ్ఘనిస్థాన్ ప్రధానమంత్రి ఘనీ, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ వాంగ్ఛుక్, మాల్దీవుల ప్రధాని ఎఫ్ఎం షహీద్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తొలుతగా నరేంద్ర మోడీని అభినందించిన వారిలో ఉన్నారు.