టెలిఫోన్ బిల్లు ఎగ్గొట్టిన వరుణ్! ఈసీకి కంప్లైంట్ చేసిన బీఎస్ఎన్ఎల్!
ఫిలిబిత్ : బీజేపీ నేత వరుణ్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. బీఎస్ఎన్ఎల్కు భారీ మొత్తంలో బిల్లు ఎగ్గొట్టిన ఆయనపై చర్య తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వరుణ్ గాంధీ బీఎస్ఎన్ఎల్కు రూ. 38,616 బాకీ ఉన్న విషయాన్ని అందులో ప్రస్తావించారు. నిబంధనలు ఉల్లంఘించినందున ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తల్లి,చెల్లి వెంటరాగ ఆమేథిలో రాహుల్ గాంధి నామినేషన్
2009 - 14 మధ్యకాలంలో వరుణ్ గాంధీ ఫిలిబిత్ ఎంపీగా ఉన్న సమయంలో అక్కడి నియోజకవర్గ ఆఫీస్లో టెలిఫోన్ ఏర్పాటు చేశారు. ఐదేళ్లలో ఆ ఫోను బిల్లు రూ.38,616 అయింది. బిల్లును లోక్సభ సెక్రటేరియట్కు పంపగా అక్కడి అధికారులు వరుణ్ గాంధీయే ఆ మొత్తం చెల్లించాలని స్పష్టం చేశారు. అయితే వరుణ్ గాంధీ బిల్లు కట్టకుండానే, బీఎస్ఎన్ఎల్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండానే ఫిలిబిత్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీఎస్ఎన్ఎల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పేపర్లతో పాటు ప్రభుత్వ సంస్థల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నియమం పాటించకపోతే ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించే అధికారం ఈసీకి ఉంది. బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు నేపథ్యంలో వరుణ్ గాంధీ విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.