ఎన్నికల ప్రచారం కోసం వసుంధర రాజే వినియోగించే బస్సు గురించి తెలుసుకుందామా..?
రాజస్థాన్: అనుకుంటే రాజకీయనాయకులకు ఏదీ కొదవ కాదు. అధికారంలో ఉన్నవారికైతే అది మరీ సులువు. ప్రస్తుతం భారత దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఈ ఏడాది చివరలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్లీస్ఘఢ్ లాంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం నేతలు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇక పర్యటనలు, బహిరంగ సభలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం తమ పర్యటనల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అధికారంలోకి రాగానే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్ర బాబు , కేసీఆర్లు తమ పర్యటనల కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టి ప్రత్యేక బస్సులను తెప్పించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో నడుస్తున్నారు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే. ఇక ఆమె ప్రత్యేకంగా చేయించుకున్న బస్సులో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలున్నాయి. అశోక్ లేలాండ్ కంపెనీ తయారు చేసిన ఈ బస్సులో ముఖ్యమంత్రి బహిరంగ ప్రసంగాలు చేసేందుకు వీలుగా సన్రూఫ్ ఉంది. బస్సుపైన ఉన్న రూఫ్ తెరుచుకోగానే లోపల ఉన్న మిని స్టాండ్ ద్వారా వసుంధరా రాజే పైకి చేరుకుంటారు. ఇంకా ఇందులో వాష్రూం, రెస్ట్ రూంలాంటివి కూడా ఉన్నాయి. మొత్తం 40 రోజుల పాటు దాదాపు 165 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. మొత్తం 6వేల కిలోమీటర్లు మేరా ఆమె ఈ బస్సులోనే ప్రయాణించనున్నారు.
మరి ఇంత ప్రత్యేకమైన బస్సును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభిస్తారు. దీన్ని ఎన్నికల రథంగా పిలుస్తున్నారు. రాజస్థాన్లోని అల్వార్, అజ్మీర్ పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం మూటగట్టుకోవడంతో ... ఈ ఎన్నికల ప్రచారం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్ గౌరవ యాత్ర పేరుతో జరుగుతున్న ఈ ప్రచారం... బీజేపీ సాధించిన విజయాలపైనే ప్రజలకు వివరించనున్నారు రాజే. ఈ యాత్రను ఆమెకు కలిసి వచ్చే రాజ్సమంద్లోని కృష్ణాలయం నుంచి ప్రారంభిస్తారు. ప్రతి సారీ ఎన్నికల ప్రచారం ముందుగా ఇక్కడి నుంచే ప్రారంభించడం వసుంధర రాజేకు ఆనవాయితీగా మారింది.
సీఎంగా వసుంధర రాజేపై ఆ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సొంత పార్టీలోనే ఆమెపై కొందరు సీనియర్ నేతలు బాహాటంగానే ప్రతికూల వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆమెపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అంతేకాదు పార్టీ హై కమాండ్ రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ను నియమించాలని భావిస్తే... ఆ నిర్ణయాన్ని వసుంధర వ్యతిరేకించారు. ఇక అప్పటి నుంచి ఆమెపై చాలామందిలో వ్యతిరేకత పెరిగిపోయింది. అయితే వీటన్నిటినీ తట్టుకుని రాజే మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలదో లేదో వేచి చూడాలి.