తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేస్తే కర్ణాటక బంద్, బెంగళూరు తాగునీరు, వార్నింగ్!
బెంగళూరు: కృష్ణరాజసాగర్ (కేఆర్ఎస్) జలాశయం నుంచి తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని వాటల్ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ఎమ్మెల్యే, కన్నడ పోరాట నాయకుడు వాటల్ నాగరాజ్ హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లో కావేరీ నీరును విడుదల చెయ్యరాదని వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన వాటల్ నాగరాజ్ కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటి గుడ్డిగా నిర్ణయం తీసుకుని తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసిందని ఆరోపించారు. తమిళనాడుకు నీరు విడుదల చెయ్యడానికి కృష్ణరాజసాగర్ (కేఆర్ఎస్) జలాశయంలో నీరు ఎక్కడ ఉందని వాటల్ నాగరాజ్ ప్రశ్నించారు.
కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటి ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు నీరు విడుదల చెయ్యడానికి ప్రయత్నిస్తే రాష్ట్ర బంద్ కు పిలిపునిచ్చి వచ్చే సోమవారం కృష్ణరాజసాగర్ (కేఆర్ఎస్) జలాశయంను మట్టుడిస్తామని వాటల్ నాగరాజ్ హెచ్చరించారు.
బెంగళూరు నగరంతో సహ కేఆర్ఎస్ పరిదిలోకి వచ్చే ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటల్ నాగరాజ్ గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యాలని ఎలా ఆదేశాలు జారీ చేస్తారని వాటల్ నాగరాజ్ ప్రశ్నించారు.
గుడ్డిగా జారీ చేసిన ఈ ఆదేశాలపై బెంగళూరు నగరంతో సహ మండ్య, మైసూరు తదితర జిల్లాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారని వాటల్ నాగరాజ్ గుర్తు చేశారు. ఇప్పటికే మండ్య, మైసూరు జిల్లాల్లో ప్రజలు, రైతులు ధర్నాలు నిర్వహించి తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తున్నారు.