ఏప్రిల్ 12 కర్ణాటక బంద్, మోడీకి వార్నింగ్, రజనీ, కమల్ సినిమాలకు బ్రేక్, కన్నడిగ దెబ్బ!
Recommended Video
బెంగళూరు: కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గురువారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించారు. తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ పిలుపునిచ్చిన బంద్ కు ఊహించని మద్దతురావడంతో కర్ణాటకలో కన్నడ సంఘాలు తెరమీదకు వచ్చాయి. తమిళనాడులో బంద్ నిర్వహించిన వారం తరువాత అదే గురువారం కర్ణాటక రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. రజనీ, కమల్ సినిమాకు బ్రేక్ వేసి కన్నడిగుల దెబ్బ రుచి చూపిస్తామని హెచ్చరించారు.
కర్ణాటక-తమిళనాడు సరిహద్దు
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని గురువారం తమిళనాడు రాష్ట్ర బంద్ నిర్వహించారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యకూడదని గురువారం తమిళనాడు-కర్ణాటక సరిహద్దులోని హోసూరు రోడ్డులోని అత్తిబెలెలో కన్నడ చళవళి వాటళ్ పార్టీ వ్యవస్థాపకుడు వాటళ్ నాగరాజ్ తో పాటు వందలాధి మంది కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
కేంద్రానికి వార్నింగ్
అత్తిబెలెలో మీడియాతో మాట్లాడిన వాటళ్ నాగరాజ్ కేంద్ర ప్రభుత్వం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి సిద్దం అయితే కన్నడిగులు కన్నెర్రచేస్తారని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యరాదని వాటళ్ నాగరాజ్ డిమాండ్ చేశారు.
ఏప్రిల్ 12 కర్ణాటక బంద్
కేంద్ర ప్రభుత్వం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యకుండా ఒత్తిడి తీసుకురావడానికి ఏప్రిల్ 12వ తేదీ కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చామని వాటల్ నాగరాజ్ అన్నారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించి ఆ రోజు కన్నడిగులు వారి సత్తాచూపిస్తారని వాటళ్ నాగరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రజనీ, కమల్ సినిమాలకు బ్రేక్
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, బహుబాష నటుడు కమల్ సినిమాలు ఇక ముందు కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకుంటామని వాటళ్ నాగరాజ్ హెచ్చరించారు.
తమిళ, కన్నడిగులు అరెస్టు
తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఒక వైపు కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని తమిళ సంఘాలు, కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యరాదని మరోవైపు కన్నడిగులు ధర్నాలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రాల పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.