కర్ణాటకలో బీజేపీకి 17 ఎంపీ సీట్లు, సీఎం కొడుకు కు షాక్, సుమలత హవా, వీడీపీ సర్వే, యూపీలో!
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల్లో ఊహించని షాక్ ఎదురుకానుందని తెలిసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని వీడీపీ అసోషియేషన్ (నేషనల్ ట్రాకర్ పోల్) సర్వేలో వెలుగు చూసింది. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో 17 నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాదిస్తుందని వీడీపీ సర్వే వెల్లడించింది.
సుమలతకు భర్త చచ్చాడనే బాధ లేదు: సీఎం ఫైర్, ఇదే మీ సంస్కారం, మహిళలు అంటే!
మండ్యలో సంకీర్ణ ప్రభుత్వానికి కచ్చితంగా ఎదురుదెబ్బ తగులుతుందని వీడీపీ సర్వే తెలిపింది. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ మద్దతుతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రముఖ నటి సుమలత విజయం సాధిస్తారని వీడీపీ సర్వే తెలిపింది.
బీజేపీకి 232 సీట్లు!
2019 లోక్ సభ ఎన్నికల సందర్బంగా దేశ వ్యాప్తంగా వీడీపీ అసోషియేషన్ సర్వే నిర్వహించింది. కర్ణాటకలో ఫలితాలు ఎలా ఉంటాయి అంటూ దేశ వాప్తంగా అనేక పార్టీలు దృష్టి సారించాయని వీడీపీ సర్వే తెలిపింది. దేశ వ్యాప్తంగా 232 లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ లో బీజేపి!
ఉత్తరప్రదేశ్ మీద బీజేపీ నాయకులు ఎక్కువ దృష్టి సారిస్తే ఆ సంఖ్య 250కు పేరిగే అవకాశం ఉందని వీడీపీ సర్వే అంచనా వేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 21 లోక్ సభ నియోజక వర్గాల్లో, జేడీఎస్ పార్టీ 7 లోక్ సభ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు 28 లోక్ సభ నియోజక వర్గాల్లో కలిసి పోటీ చేస్తున్నాయి.
ఎవరికి ఎన్ని సీట్లు!
వీడీపీ అసోషియేషన్ (నేషనల్ ట్రాకర్ పోల్) సర్వే ప్రకారం లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి 17 సీట్లు, కాంగ్రెస్ కు 8 సీట్లు, జేడీఎస్ కు 2 సీట్లు వస్తాయని వెలుగు చూసింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీకి ఎక్కువ లాభం ఉంటుందని, ఆ పార్టీకి 17 సీట్లు వస్తాయని వీడీపీ సర్వే తెలిపింది.
మండ్యలో సుమలత హవా!
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించి చివరికి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సుమలతకు బీజేపీ, కర్ణాటక రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మండ్యలో సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి సంకీర్ణ పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మండ్యలో సుమలత విజయం సాధిస్తారని వీడీపీ సర్వే తెలిపింది. మండ్యలో గతంలో దివంగత రెబల్ స్టార్ అంబరీష్ చేసిన అభివృద్ది పనులు సుమలతకు కలిసి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
మూడు పార్టీల ఓటు బ్యాంకు
వీడీపీ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో అనే విషయం వెలుగు చూసింది. బీజేపీకి 45.2 శాతం, కాంగ్రెస్ కు 39. 9 శాతం, జేడీఎస్ కు 14. 1 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేసినా 47 శాతం ఓట్లు ఆ పార్టీలకు వస్తాయని సర్వే తెలిపింది. మొత్తం మీద మండ్య లోక్ సభ నియోజక వర్గంలో సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి విజయం సాదించడం అంత సులభం కాదని వీడీపీ సర్వే తెలిపింది.