మూల్యం చెల్లించాం: జగన్పై మొయిలీ, జాలి వదిలి సర్జరీ
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి దూరం కావడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ గురువారం మరోసారి స్పందించారు. వైయస్ జగన్ తమ పార్టీకి దూరం కావడం తమకు చాలా నష్టం కలిగిందని అభిప్రాయపడ్డారు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లినందుకు భారీ మూల్యం చెల్లించుకున్నామని చెప్పారు.
మొయిలీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో తమ వ్యూహం విఫలమైందన్నారు. జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయేలా తామే చేశామన్నారు. దేశంలో ప్రాంతీయ, స్థానిక నాయకత్వాలను అభివృద్ధి చేయలేకపోయామని ఆయన అన్నారు. కాంగ్రెసు ఎన్నికల్లో అనేక తప్పులు చేసిందని అన్నారు. కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఘోరంగా విఫలమైందని అన్నారు. లోకసభనే నడపలేని తాము దేశాన్ని ఎలా నడపగలమని అన్నారు.
ప్రజలు కాంగ్రెసు పార్టీని నమ్మలేని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కార్యక్రమాల అమలులో ప్రభుత్వ వేగం మందగించిందని అభిప్రాయపడ్డారు. ప్రధానికి అధికార యంత్రాంగం సహకరించలేదని చెప్పారు. ఓటమికి బాధ్యులను నిర్ధారించి, వారి నుంచి వివరణ కోరాలని ఆయన సూచించారు. గ్రామస్థాయి నుంచి ఎఐసిసి స్థాయి వరకు పార్టీలో ప్రక్షాళన అవసరమని, పార్టీకి భారీ శస్త్రచికిత్స జరగాలని మొయిలీ అన్నారు. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని ఆయన సూచించారు. పార్టీలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.
కాగా, గురువారం దేశవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ ఓటమిపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టేందుకు కనికరం లేకుండా సర్జరీ చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. బిజెపి గెలుపు కోసం ఆ పార్టీ నేతలు ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డారని, దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పని చేశారని, సోషల్ మీడియాను ఆ పార్టీ విస్తృతంగా ఉపయోగించుకుందని తద్వారా పట్టణ ఓటర్లను ఆకర్షించిందని చెప్పారు.
పట్టణ ఓటర్లు, యువత వల్ల ఓడామన్నారు. ఐటి విప్లవం తెచ్చిన కాంగ్రెసు పార్టీయే దానికి బలైందని చెప్పారు. రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వంటి సామాజిక వెబ్ సైట్లను ఉపయోగించాల్సింది అన్నారు. సిడబ్ల్యూసికి ఎన్నికలు జరిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు.