ఎగ్జిట్ పోల్స్ స్టాక్ మార్కెట్ల కోసమే.. కొందరికి 5 లక్షల కోట్ల లాభం : వీరప్ప మొయిలీ
బెంగళూరు : లోక్సభ ఎన్నికల ప్రచారం నాటి సీన్ మళ్లీ కనిపిస్తోంది. హాట్ హాట్గా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేతలు.. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక అదే తీరుగా వ్యవహరించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఎన్డీయే అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. అవన్నీ తూచ్ అంటున్నారు విపక్ష నేతలు. ఆ క్రమంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సహా చాలామంది లీడర్లు ఎగ్జిట్ పోల్స్ను వ్యతిరేకించారు.
ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. అవన్నీ తప్పుల తడకగా అభివర్ణిస్తున్నారు. అధికారంలో ఉండి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్ తిరువనంతపురంలో ఎగ్జిట్ పోల్స్పై కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే.. మరో సీనియర్ వీరప్ప మొయిలీ బెంగళూరులో హాట్ కామెంట్స్ చేయడం చర్చానీయాంశమైంది.
ఎగ్జిట్ పోల్స్కు అంత సీన్ లేదు.. బీజేపీ మునిగిపోతున్న నౌక : శశి థరూర్
బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన వీరప్ప మొయిలీ ఎగ్జిట్ పోల్స్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్లను కాపాడటం కోసమే వాటిని వెల్లడించారని ఆరోపించారు. వాటి వల్ల కొందరు నాలుగున్నర లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల వరకు లాభం పొందారని చెప్పుకొచ్చారు.
కొందరి నేతల ఆలోచన ధోరణి ఎగ్జిట్ పోల్స్లో ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించిన మొయిలీ.. వాటిని చూసి బీజేపీ నేతలు పొంగిపోతున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్లో లెక్కలేనన్ని తప్పులున్నాయని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ వెనుక మరో కుట్ర దాగి ఉందని చెప్పారు. వాటి కారణంగా విపక్షాల ఐక్యత కూడా దెబ్బతినడం మరో పరిణామమని వ్యాఖ్యానించారు. ప్రజల నాడి తెలిసే రోజున ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ మెజార్టీ వచ్చినా.. ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పుకొచ్చారు.