వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిపై ఎఫ్ఐఆర్
చెన్నై: స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశారు. అనుమతి లేకుండా బ్యానర్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని ముత్తులక్ష్మి మీద కేసు నమోదు అయ్యింది.
స్మగ్లర్ వీరప్పన్ కర్ణాటక, తమిళనాడు అటవి ప్రాంతాలలో వేలాది ఏనుగులను హతమార్చి దంతాలు సేకరించి, వేల టన్నుల గంధం చెక్కలను స్మగ్లింగ్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాల పాటు ఎస్ టీఎఫ్ దళాలు వీరప్పన్ కోసం గాలించాయి.
అయితే వీరప్పన్ అందరికి చుక్కలు చూపించాడు. అయితే 2004 అక్టోబర్ 18వ తేదిన రాత్రి ఎస్ టీఎఫ్ దళాలు వీరప్పన్ ను చాకచక్యంగా అంతం చేశాయి. తరువాత సేలం జిల్లా లోని కోలత్తూరు సమీపంలో ఉన్న మూలకాడు ప్రాంతంలో వీరప్పన్ ను ఖననం చేశారు.
అప్పటి నుంచి వీరప్పన్ సంస్మరణ దిన్నాన్ని అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులు నిర్వహిస్తున్నారు. 2015 అక్టోబర్ 18వ తేది ఆదివారం వీరప్పన్ 11వ సంస్మరణ దిన్నాని ఆచరించారు. ఆ సందర్బంగా మూలక్కాడు, మేచ్చేరి తదితర చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు అతికించారు. పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.
అనుమతి లేకుండా బ్యానర్లు, పోస్టర్లు అతికించారని ఆరోపిస్తూ మేచ్చేరి పోలీసులు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి మీద కేసు నమోదు చేశారు. ముత్తులక్ష్మి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మేచ్చేరి పోలీసులు తెలిపారు.