వీర్సావర్కర్కు అవమానం: ఆ యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన..భారీగా పోలీసుల మోహరింపు
వారణాసి: ఓవైపు జేఎన్యూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా దేశంలోని మరో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఆందోళన వాతావరణం నెలకొంది. జాతీయనేత వీర్సావర్కర్కు చెందిన ఫోటోను చెడగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో బెనారస్ యూనివర్శిటీ క్యాంపస్లో పోలీసులు భారీగా మోహరించారు.
ప్రతిరోజులానే విద్యార్థులు తమ తరగతికి వెళ్లారు. అయితే తరగతి గదిలో ఉన్న వీర్సావర్కర్ ఫోటో కింద పడి ఉండటాన్ని మంగళవారం ఉదయం విద్యార్థులు గమనించారు. అంతేకాదు అది పొరపాటున పడిందని చెప్పేదానికి లేదని ఫోటోలో ఉన్న వీర్సావర్కర్ ముఖంపై ఇంక్ను పోశారని విద్యార్థులు చెప్పారు. ఈ ఘటన పొటిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్టో జరిగింది. ఈ డిపార్ట్మెంట్లో జాతిపితా మహాత్మాగాంధీ ఫోటోతో పాటు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫోటోలు కూడా గోడకు ఉంటాయి. అయితే వీర్సావర్కర్ ఫోటో కిందపడిపోయి ఉండటంతో ఆగ్రహించిన విద్యార్థులు దీనికి బాధ్యులైన వారిని వెంటనే పట్టుకుని చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ధర్నాకు దిగారు.
విద్యార్థులు ధర్నాకు దిగడంతో యూనివర్శిటీ పాలనా విభాగం అధికారులు ఘటనపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే క్యాంపస్లో పెద్ద ఎత్తున్న ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు క్యాంపస్లో భారీగా మోహరించారు. గతవారం జేఎన్యూ క్యాంపస్లోని స్వామి వివేకానంద విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాదు కొన్ని అసభ్యకరమైన సందేశాలు కూడా పక్కనే పడిఉండటాన్ని గుర్తించారు.
ఇదిలా ఉంటే ఒక నెల సమయంలోనే బెనారస్ యూనివర్శిటీలో ఆందోళన వాతావరణం కనిపించడం ఇది రెండవ సారి. నవంబర్ 7వ తేదీన సంస్కృతం శాఖలో ముస్లిం ప్రొఫెసర్ను నియమించడంతో కొంతమంది విద్యార్థులు నిరసనలు తెలిపారు. సంస్కృతం బోధించేందుకు ముస్లిం వ్యక్తిని ప్రొఫెసర్గా నియమించడమేంటంటూ ప్రశ్నించారు.