దెబ్బ మీద దెబ్బ.. ఈశాన్య ఢిల్లీ ప్రజలకు ఊహించని షాక్.. సామాన్యుల కష్టాలు..
రెండు రోజుల పాటు రావణకాష్టంలా కాలిన ఈశాన్య ఢిల్లీ ప్రజలకు దెబ్బ మీద దెబ్బ తగలుతోంది. హింస కారణంగా రెండు రోజుల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినవారికి ఇప్పుడు నిత్యావసర వస్తువుల రూపంలో మరో షాక్ ఎదురైంది. పాలు,కూరగాయలు ఇతరత్రా నిత్యావసర వస్తువులు అమాంతం పెరిగిపోవడంతో కొనలేని పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నారు. కొన్ని షాప్స్ మాత్రమే తెరుస్తుండటంతో.. తెరిచిన కాసేపటికే స్టాక్ అయిపోతున్న పరిస్థితి. అది కూడా ఎక్కువ ధరలకు విక్రయిస్తుండటంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది.
ధరల పెరుగుదలపై సామాన్యుల వాదన...
సాధారణ రోజుల్లో లీటరు పాల ధర రూ.42 ఉంటుందని.. కానీ బుధవారం తాను రూ.50కి కొనాల్సి వచ్చిందని జాఫ్రాబాద్ నివాసి సుభాష్ మొహల్లా చెప్పారు. తాము ఉంటున్న ప్రాంతంలో దుకాణాలన్నీ మూసి ఉండటంతో.. కి.మీ దూరంలోని మరో షాప్కు వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకున్నట్టు తెలిపాడు. నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకున్నవారు అదృష్టవంతులు అని.. తమ లాగా పనిచేస్తేనే బతికేవాళ్లు.. ఎప్పటిలాగే పనుల్లో పడి నిత్యావసర వస్తువులను కొనుక్కోలేకపోయారని చెప్పాడు.
నార్త్ ఢిల్లీలో
గృహిణులు ఏమంటున్నారు..
జాఫ్రాబాద్కి చెందిన షకీల్ అనే స్వయం ఉపాధి చేసుకునే వ్యక్తి మాట్లాడుతూ.. తమ ప్రాంతానికి ఘాజీపూర్ మండి నుండి కూరగాయలు వస్తాయన్నాడు. గత రెండు రోజులుగా చెలరేగిన హింస కారణంగా.. కూరగాయాలు రావడం లేదన్నాడు. ఇక్కడున్న పరిస్థితుల కారణంగా కూరగాయల వ్యాపారులు ఇటువైపు రావడం లేదని.. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నాడు. మౌజ్పూర్కి కమలేష్ అనే ఓ గృహిణి మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో పాల కొరత ఎక్కువగా ఉందన్నాడు. స్థానిక దుకాణాలు మూసివేయడంతో పాలు దొరకడం లేదన్నారు. ఇళ్లల్లో పాలుతాగే చిన్నపిల్లలు ఉన్నారని.. ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉండటంతో పాలు కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
నిత్యావసరవ వస్తువుల కోసం వేరే ప్రాంతాలకు
పాలు లేకపోవడంతో ఉదయం కేవలం బ్లాక్ టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని మౌజ్పూర్కి చెందిన మరో గృహిణి తెలిపారు. స్థానిక దుకాణాలు మూసివేశారని.. కొంతమంది తమ ఇళ్లల్లోనే నిత్యావసర వస్తువులను అమ్ముతున్నప్పటికీ.. టమోటో,ఆలుగడ్డ వంటి కూరగాయాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు.జాఫ్రాబాద్-మౌజ్పూర్-బబుర్పూర్ మెట్రో స్టేషన్ల మధ్య ఉన్న రోడ్ నం.66 వద్ద ఓ యువకుడు మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువులు,కూరగాయల కోసం తాను రోడ్డు పైకి వచ్చానని,కానీ ఎక్కడా దొరకట్లేదని వాపోయాడు.అదే ప్రాంతంలో మరో వ్యక్తి బ్యాగ్ నిండా కిరాణ వస్తువులను నింపుకుని ఇంటికి వెళ్తూ కనిపించాడు. వాటి కోసం తాను షహ్దరా వరకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపాడు. కర్ఫ్యూ కారణంగా తమ ప్రాంతంలోకి కూరగాయలు,ఇతరత్రా వ్యాపారులు రావట్లేదని.. దీంతో వేరే ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని చెప్పాడు. ఎలాగోలా కష్టపడి మొత్తానికి ఇంటికి నిత్యావసర వస్తువులు తీసుకెళ్తున్నట్టు చెప్పాడు.
Recommended Video
22కి పెరిగిన మృతుల సంఖ్య
ఈశాన్య ఢిల్లీలో మూడు రోజుల పాటు చెలరేగిన హింస కారణంగా ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో రతన్ లాల్ అనే ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. హింసపై స్పందించిన ప్రధాని మోదీ.. ఢిల్లీ ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. శాంతి, సామరస్యం నెలకొల్పేందుకు క్షేత్రస్థాయిలో పోలీస్,భద్రతా బలగాలు పనిచేస్తున్నాయన్నారు. మరోవైపు ఈ ఘటనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.