కూరగాయల్లో విషపూరిత పదార్థాలు.. భయానక నిజాలు వెల్లడించిన రీసెర్చ్..!
ఢిల్లీ : కల్తీ, కల్తీ, కల్తీ. తినే ఫుడ్ దగ్గర్నుంచి ఆరోగ్యం బాగా లేకుంటే వేసుకునే మందుబిళ్ల వరకు అంతా కల్తీయే. కల్తీగాళ్లు రాజ్యమేలుతూ కాసులు దండుకోవడమే ధ్యేయంగా జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చివరకు పొద్దుపొద్దునే తాగే పాలు కూడా కల్తీ చేస్తుండటం కేటుగాళ్ల మోసాలకు పరాకాష్టలా నిలుస్తోంది. అదలావుంటే మానవ తప్పిదాల కారణంగా కాలుష్యం దినాదినాభివృద్ధి చెంది మరో రకమైన అనర్థాలకు దారితీస్తోంది. ఆ క్రమంలో తాజాగా కూరగాయల్లో సైతం విష పదార్థాలు ఉన్నాయనే రీసెర్చ్ రిపోర్ట్ కలవరం రేపుతోంది.
రివర్స్ గేర్ : యువతి వేధిస్తోందని యువకుడు సూసైడ్ అటెంప్ట్..!
భయానక నిజాలు.. కూరగాయల్లో విష పదార్థాలు..!
నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఓ పరిశోధన భయానక నిజాలు బయటపెట్టింది. ఢిల్లీలో అమ్ముతున్న కూరగాయల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేల్చింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఢిల్లీ మార్కెట్కు తరలించే కూరగాయల్లో టాక్సిక్ మెటల్స్ ఉన్నాయనే విషయం వెలుగుచూడటంతో నగరవాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
యమునా నదీ పరీవాహక ప్రాంతంలో..!
యమునా నది పరీవాహక ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయల్లో లెడ్ పరిమాణం ఎక్కువగా ఉందనే విషయం బయటపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. లెడ్ పరిమాణం ఎక్కువగా ఉన్న ఇలాంటి కూరగాయలను దీర్ఘకాలికంగా తీసుకున్నట్లయితే శరీర అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందనేది రీసెర్చ్లో బయటపడింది. ఊపిరితిత్తులు, కిడ్నీలతో పాటు మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముందని తేల్చింది ఆ నివేదిక.
చిన్నపిల్లల్లో కూడా మానసిక రుగ్మతలు తలెత్తే ముప్పు ఉందట.యమునా నది పరీవాహక ప్రాంతాల్లో పండించే కూరగాయలే సాధారణంగా ఢిల్లీ మార్కెట్కు వస్తుంటాయి. ఆ క్రమంలో ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్న కూరగాయలను పరీక్షించగా క్యాబేజీతో పాటు కొత్తిమీరలో సాధారణ స్థాయికి మించి లెడ్ ఉన్నట్లు గుర్తించడం కలకలం రేపుతోంది. అదలావుంటే మిగతా కూరగాయల్లో వాస్తవానికి లెడ్ వాల్యూమ్ కిలోకు 2.5 మిల్లిగ్రామ్స్ ఉండాలి.. కానీ అక్కడ పండించిన కూరగాయల్లో మాత్రం 2.8 మిల్లిగ్రామ్స్ నుంచి అత్యధికంగా 13.8 మిల్లిగ్రామ్స్ ఉన్నట్లు తేలిందట.
డేంజర్ బెల్స్.. తినే తిండి కూడా విషమేనా?
యమునా నది పరీవాహక ప్రాంతంలో వివిధ పరిశ్రమల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు కనిపిస్తోంది. అక్కడి ఏరియాలో ఆటోమొబైల్, పెయింట్, బ్యాటరీలు, పాలిథీన్ తయారీ లాంటి ఇండస్ట్రీలు చాలా ఎక్కువగా ఉండటంతో కాలుష్యం కోరలు చాస్తోందనే ఆరోపణలున్నాయి. అలాంటి పరిశ్రమలతోనే నదులు, కాలువల్లో లెడ్ పరిమాణం పెరుగుతుందనేది ఒక కారణంగా అనుమానం వ్యక్తమవుతోంది.
మొత్తానికి ఢిల్లీలో అమ్ముతున్న కూరగాయల్లో విషపూరిత పదార్థాలు ఉంటున్నాయనే రీసెర్చ్ రిపోర్ట్ ఆందోళన కలిగిస్తోంది. తినే తిండి కూడా సరిగా దొరక్కపోతే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరిశ్రమలపై అధికారుల ఉదాసీనతే ఇలాంటి పరిస్థితికి కారణమవుతోందనే వాదనలు లేకపోలేదు.