‘పొల్యూషన్ చెక్’పై 18శాతం జీఎస్టీ చెల్లించాలి: ఏఏఆర్
న్యూఢిల్లీ: వాహనాలకు తీసుకునే కాలుష్యం స్థాయి ధృవీకరణ పత్రానికి 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) మంగళవారం విడుదల చేసింది.
వాహనదారులకు ప్రభుత్వం తరపున పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు అందించే సేవలకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉందా? అంటూ వెంకటేశ్ ఆటోమొబైల్స్ అనే సంస్థ ఏఏఆర్కు దరఖాస్తు చేసుకుంది.
ఈ దరఖాస్తుపై స్పందించిన ఏఏఆర్ గోవా బెంచి.. ఆ సేవలకు జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. కాలుష్య స్థాయిని తెలిపే ధృవీకరణ పత్రం జారీకై సంస్థలు చేసే కార్యకలాపాలు సర్వీసెస్ అకౌంట్ కోడ్ 9991 పరిధిలోకి రావని ఏఏఆర్ తెలిపింది. అందువల్ల వాటికి జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
వాహనదారులు ఆ పత్రాన్ని తీసుకోవాలంటే 18శాతం జీఎస్టీ చెల్లించాలని వివరించింది. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనానికి పీయూసీ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని ఏఏఆర్ తెలిపింది.