వాళ్లే చేశారు: రైలు ధరలు, హిందీపై వెంకయ్య వివరణ
హైదరాబాద్: హిందీ వాడకంపై ప్రభుత్వం ఉత్తర్వులు, రైలు ఛార్జీల పెంపు పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం వివరణ ఇచ్చారు. ఈ రెండు కూడా యూపిఏ ప్రభుత్వం వల్లేనని చెప్పారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాకుండానే విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. తమను విమర్సించే వారి తీరు.. దున్నపోతు ఈనిందంటే దూడకు గడ్డేయమన్నట్లుగా ఉందన్నారు.
ఢిల్లీలోని విద్యుత్ కోతలకు గత ప్రభుత్వాలే కారణమని చెప్పారు. ప్రజా తీర్పును కాంగ్రెసు పార్టీ అపహాస్యం చేస్తోందన్నారు. అవకాశవాదులు మాత్రమే తమ పైన విమర్శలు చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం వల్లే రైలు ఛార్జీలు పెరిగాయనడం విడ్డూరమన్నారు. సోషల్ మీడియాలో హిందీ వాడాలని యూపీఏ ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. యూపీఏ ప్రభుత్వ ఆదేశాలను మరిచి చిదంబరం విమర్శలు చేయడమేమిటన్నారు.
ఢిల్లీలో విద్యుత్ కోతలపై మీడియాను ఆకట్టుకునేందుకు బీజేపీ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ కోతలు పెరిగితే ఆయా విద్యుత్ కార్యాలయాల వద్ధ ధర్నా చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు బీజేపీ వల్లే ధరలు పెరిగాయని నిందలు మోపుతున్నాయని మండిపడ్డారు. హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే అపప్రద తమపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందీ భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వాడాలని మార్చిలో యూపీఏ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అది కూడా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమేనని ఆయన వెల్లడించారు. అదిప్పుడు అమల్లోకి వచ్చిందన్నారు. హిందీ భాషను తమిళనాడులో పెట్టాలని ఎవరూ చెప్పలేదన్నారు. రైల్వే ఛార్జీల పెంపుదల మే నుంచి అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గే ప్రతిపాదనలు తయారు చేసి పెండింగ్లో పెట్టారన్నారు. యూపీఏ సగంలో ఆపేసిన పనులను పూర్తి చేస్తుంటే ఇప్పుడు వారే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రైల్వే ఛార్జీలను పెంపుదలకు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు రూపొందాయన్నారు. ఫిబ్రవరిలోనే ప్రతిపాదనలు వచ్చాయన్నారు. రైల్వే ఛార్జీల పెంపును ఆమోదించింది యూపీఏనే అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడాన్ని ఆయన ఖండించారు.