ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కంట తడి: జైపాల్ మృతిపై రాజ్యసభ సంతాపం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణం ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడిని కలచి వేసింది. సంతాప తీర్మానాన్ని చదువుతూ ఆయన ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారు. జైపాల్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం రాజ్యసభలో ఈ ఘటన చోటు చేసుకుంది. జైపాల్ రెడ్డి మృతిపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఛైర్మన్ స్థానంలో కూర్చుని వెంకయ్య నాయుడు తీర్మానాన్ని చదువుతుండగా ఆయన గొంత మూగబోయింది. చదవడాన్ని మధ్యలోనే ఆపేశారు. కన్నీరు పెట్టుకున్నారు. జైపాల్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కర్ణాటక టెర్రర్ స్పీకర్.. జైపాల్ పాడె మోస్తూ కన్నీటి పర్యంతమైన వేళ..
సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం రాజ్యసభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. సభ్యులు ఈ తీర్మానంపై మాట్లాడారు. జైపాల్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కంటతడి పెట్టుకున్నందుకు.. వెంకయ్య నాయుడు సభకు క్షమాపణ కోరారు. ఛైర్మన్ స్థానంలో ఉండి తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని, క్షమించాలని ఆయన విజ్ఙప్తి చేశారు. జైపాల్ రెడ్డితో తనకు 40 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. తామిద్దరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యామని గుర్తు చేశారు. శాసనసభలో ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్లమని అన్నారు. జైపాల్ రెడ్డి తన కంటే ఆరేళ్ల పెద్దవాడని.. అయినప్పటికీ ఆ వ్యత్యాసం ఎక్కడా కనపించనిచ్చేవారు కాదని అన్నారు. ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లడం కలచి వేస్తోందని చెప్పారు.
చరిత్ర, సమకాలీన రాజకీయాలు, సామాజిక అంశాలు.. ఇలా అన్నింటిపైనా ఆయనకు మంచి పట్టు ఉందని అన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ బాషల్లో జైపాల్ రెడ్డి అనర్గళంగా మాట్లాడగలరని, ఆంగ్లంలో ఆయన ప్రయోగించే పదాల కోసం ఒక్కోసారి డిక్షనరీలను వెదకాల్సి వచ్చేదని వెంకయ్య నాయుడు చెప్పారు. ఎలాంటి అంశంపైన అయినా లోతుగా విశ్లేషించగల సామర్థ్యం జైపాల్ రెడ్డికి ఉందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయనను ప్రశంసిస్తారని, రాజకీయ గురువుగా భావిస్తారని అన్నారు. చిట్టచివరి నిమిషం వరకూ జైపాల్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.