పోలీసుల్ని చంపేస్తే ఈ మానవహక్కులేవి, నేతాజీ అంశం షాక్: వెంకయ్య
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్ల పైన మానవ హక్కుల సంఘం నిరసనలు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఘాటుగా స్పందించారు. గతంలో ఎర్రచందనం దొంగలు, స్మగ్లర్లు పోలీసులను, అటవీ శాఖ అధికారులను చంపేసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న మానవ హక్కుల సంఘాల నేతలు, మజ్లిస్ నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
మానవ హక్కుల సంఘాలకు ద్వంద్వ ప్రమాణాలు తగదన్నారు. పోలీసులు చనిపోయినప్పుడు నోరెత్తని వారు, ఇప్పుడు ఉగ్రవాదులు, స్మగ్లర్లు కోసం మానవ హక్కులు అంటూ గొంతు చించుకోవడం సిగ్గుచేటు అన్నారు. సిమి ఉగ్రవాదులు పోలీసులను బలిగొన్నప్పుడు ఎందుకు నోరు మెదపలేదన్నారు. పోలీసుల కుటుంబాలకు కనీసం సానుభూతి తెలపలేదన్నారు.
సుభాష్ చంద్రబోస్ కుటుంబం పైన ఇరవయ్యేళ్ల పాటు నిఘా దారుణమని వెంకయ్య అన్నారు. దీనిపై సమగ్ర దర్యాఫ్తు జరిపి అన్ని విషయాలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. దేశం గర్వించదగ్గ మహా నాయకుడు నేతాజీ అన్నారు.
అలాంటి నాయకుడి కుటుంబంపై నిఘా పెట్టారని తెలియడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నుండి వచ్చాక దీనిపై మాట్లాడుతామని చెప్పారు. ఈ నిఘా ఏ ప్రభుత్వం హయాంలో జరిగింది, దీనికి బాధ్యులెవరో బయటపెడతామన్నారు.