"ఫోటో కోసమే రాహుల్ ఆరాటం.. ఆనాడు దిగ్విజయ్ను ఎందుకు నిలదీయలేదు?"
1998 జనవరి12న బీతుల్ జిల్లాలో అప్పటి సీఎం దిగ్విజయ్ సింగ్ హయాంలో పోలీసులు కాల్పులు జరిగిన సంగతి గుర్తుచేశారు. ఆ సంఘటనలో మొత్తం 24మంది రైతులు మరణించారని చెప్పారు.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో రైతులపై సాగించిన దమనకాండపై కాంగ్రెస్ పార్టీ బీజేపీని తీవ్రంగా విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంద్ సౌర్ లో రైతులను పరామర్శించడానికి వెళ్లగా.. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.
అన్నదాతపై కన్నెర్ర: తూటాలకు బలైన రైతులు.. మధ్యప్రదేశ్లో తీవ్ర హింసాత్మకం..
అటు బీజేపీ సైతం కాంగ్రెస్ పట్ల ఘాటుగానే స్పందిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రాహుల్ గాంధీ పర్యటన పట్ల విరుచుకుపడ్డారు. రాహుల్ తాపత్రంయం, హడావుడి అంతా కేవలం ప్రచార ఆర్భాటమేనన్నారు. నలుగురి కనిపించేలా మరో ఫోటో కోసమే ఆయన ఆవేశపడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ బీజేపీని విమర్శించడాన్ని తప్పుపట్టిన వెంకయ్య.. గతంలో కాంగ్రెస్ రైతుల పట్ల వ్యవహరించిన తీరును గుర్తుచేశారు. 1998 జనవరి12న బీతుల్ జిల్లాలో అప్పటి సీఎం దిగ్విజయ్ సింగ్ హయాంలో పోలీసులు కాల్పులు జరిగిన సంగతి గుర్తుచేశారు. ఆ సంఘటనలో మొత్తం 24మంది రైతులు మరణించారని చెప్పారు.
ఆనాడు రైతుల పట్ల వ్యవహరించిన తీరుకు కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ రాజీనామా కోరిందా? అని వెంకయ్య ప్రశ్నించారు. నాడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాధిత కుటుంబాలను పరామర్శించారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా బాధ్యత గల రాజకీయ పార్టీగా నడుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మరింత రెచ్చగొట్టకుండా రాజకీయం చేయకుండా ఉండాలని కోరారు.