అరగంట ఆలస్యమన్నారు: ముండే మృతిపై వెంకయ్య
న్యూఢిల్లీ: తాను అరగంట ఆలస్యంగా వస్తానని చెప్పిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని కేంద్రమంత్రి గోపినాథ్ ముండే దుర్మరణంపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం తనను కలిసిన ముండే.. అరగంట ఆలస్యంగా పార్లమెంటుకు వస్తానని చెప్పినట్లు తెలిపారు. తలకు గాయం కావడం, గుండె ఆగిపోవడం వల్లే గోపినాథ్ మృతి చెందారని వైద్యులు తెలిపినట్లు చెప్పారు.
మంగళవారం జాతీయ సంతాపదినంగా ప్రకటించినట్లు తెలిపారు. గోపినాథ్ ముండే ప్రజాదరణ కలిగిన నాయకుడని వెంకయ్య నాయుడు కొనియాడారు. మంచి భవిష్యత్ ఉన్న నాయకుడు ఈ విధంగా మృతి చెందడం తమను చాలా బాధించిందని తెలిపారు.
గోపినాథ్ ముండే ఐదు పర్యాయాలు అసెంబ్లీకి, రెండు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారని వెంకయ్య నాయుడు తెలిపారు. ముండే మృతి భారతీయ జనతా పార్టీతోపాటు దేశానికి, ప్రభుత్వానికి తీరని లోటని ఆయన అన్నారు. ఆయన ముండే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గోపినాథ్ ముండే మరో గొప్ప నాయకుడు ప్రమోద్ మహాజన్ లాగే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించారని అన్నారు. ముండే.. మహాజన్కు దగ్గరి బంధువని తెలిపారు
బుధవారం నుంచి వారంరోజులపాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని వెంకయ్య నాయుడు తెలిపారు. బుధవారం ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రొటెం స్పీకర్ ఎన్నిక జరుగుతుందని, ఆ తర్వాత గోపినాథ్ ముండేకు సంతాప తీర్మానం చేసిన అనంతరం సభ ఎల్లుండి(జూన్ 6)కి వాయిదా పడుతుందని చెప్పారు. జూన్ 6న స్పీకర్ ఎన్నిక జరుగుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. 10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగిస్తారని చెప్పారు.