జాతి వ్యతిరేకమే: పార్లమెంట్లో ఊగిపోయిన వెంకయ్య
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా హెచ్సీయూ, జెఎన్యూ ఘటనలపై లోక్సభలో బుధవారం వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశ సమగ్రతకు ముప్పప వాటిల్లే వ్యవహారిస్తే ఉపేక్షించేది లేదన్నారు.
దేశ శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదన్నారు. యూనివర్సిటీల్లో కొందరు విద్యార్ధులు మావోయిస్టుల భావజాలంతో ఉన్నారని అన్నారు. అఫ్జల్ గురు, యాకుబ్ మెమెన్లను సమర్ధించిన వారంతా దేశ వ్యతిరేకులేనని వ్యాఖ్యానించారు.
దేశ సమగ్రత విషయంలో పార్లమెంట్ మొత్తం ఒక్కటై ఖండించాలన్నారు. మావోయిస్టుల భావజాలంతో ఉన్న విద్యార్ధులే మిగతా వారిని చెడగొడుతున్నారని అన్నారు. దేశ సమగ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అన్నారు. వారి భావజాలం మంచిదో కాదో ప్రజలే తేలుస్తారన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ అంబేడ్కర్ మాటలను ఆయన చదివి వినిపించారు. దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదన్నారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వాటిని సమర్థించమన్నారు. ఇవేవీ ఏ ఒక్కరి వ్యక్తిగత విషయాలు కాదన్నారు. జెఎన్యూ, హెచ్సీయూ ఘటనల వెనుక ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు.
రాహుల్పై మండిపడ్డ షా
అఫ్జల్ గురుకు అనుకూలంగా, జాతి వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థులు చేసిన నినాదాల్ని సహించమంటారా? ఈ విషయంలో స్పష్టతనివ్వండని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాహుల్ గాంధీని కోరారు. కాంగ్రెస్ని తాను ఈ ప్రశ్న సూటిగా అడగదలుచుకున్నానని చెప్పారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని అమిత్ షా విమర్శించారు. ప్రభుత్వం తనను చూసి భయపడుతోందని, అందుకే పార్లమెంట్లో జేఎన్యూ ఘనటపై తనను నోరు తెరవనివ్వడం లేదని రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. ఈ నేపథ్యంలో అమిత్షా పై విధంగా స్పందించారు.