పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి మన్మోహన్ సింగ్: దిగ్విజయ్ రాజీనామా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ను ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇప్పటివరకు ఈ పదవిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కొనసాగారు.
కాగా, మన్మోహన్ సింగ్ కోసం దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మాజీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి అయిన మన్మోహన్ సింగ్ 2014 సెప్టెంబర్ నుంచి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే, ఈ ఏడాది జూన్లో ఆయన రాజ్యసభ పదవి కాలం ముగియడంతో 2019 మే నెలలో కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
అనంతరం ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను నామినేట్ చేశారు. అయితే, మన్మోహన్ సింగ్ ఇటీవల రాజస్థాన్ నుంచి మరోసారి రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో ఆయన కోసం దిగ్విజయ్ సింగ్ ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాజీనామా చేశారు.
కాగా, దిగ్విజయ్ సింగ్ స్థానంలో మన్మోహన్ సింగ్ను ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నామినేట్ చేశారు. ఇక దిగ్విజయ్ సింగ్ను పట్ణణాభివృద్ధి వ్యవహారాల పార్లమెంటు కమిటీకి నామినేట్ చేసినట్లు రాజ్యసభ బులిటెన్ పేర్కొంది.