ఎగ్జిట్ పోల్సేమీ ఎగ్జాట్ పోల్స్ కావు... మే 23 వరకు ఆగండంటున్న నేతలు..
ఢిల్లీ : కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్జీయే అధికారంలోకి వస్తుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయన్న అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 1998 నుంచి 2014 ఎన్నికల వరకు వివిధ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వాస్తవ ఫలితాలకు దూరంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ నిజం కాదు, ప్రజలు తీర్పు ముఖ్యం, నటుడు ప్రకాష్ రాజ్, అవి పగటి కలలు !
పలుమార్లు తప్పిన లెక్క
1998లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అభిప్రాయపడ్డాయి.అయితే అప్పట్లో ఎన్డీఏ 252 సీట్లలో విజయం సాధించగా.. యూపీఏ 166తోనే సరిపెట్టుకుంది. 2004లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని దాదాపు ఇవే సంస్థలు అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బొటాబొటి మెజార్టీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పగా... అప్పట్లో ఆమ్ ఆద్మీ 70లో 67స్థానాలు కైవసం చేసుకుంది. బీహార్ విషయంలోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల విశ్వసనీయతపై చర్చ జరుగుతోంది.
అవి ఎగ్జాట్ పోల్స్ కాదు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. అవి ఎగ్జిట్ పోల్స్ తప్ప ఎగ్జాట్ పోల్స్ కాదన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. 1999 నుంచి వివిధ ఎన్నికల సమయంలో వెలువడిన సర్వే అంచనాలు తప్పాయన్న విషయాన్ని వెంకయ్య గుర్తు చేశారు. గుంటూరులో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన... ఫలితాలపై ఇప్పుడే ఒక అంచనాకు రావడం సరికాదన్నారు. మే 23 వరకు వేచి చూడాలని చెప్పారు.
ఆస్ట్రేలియా తరహాలో సర్ప్రైజ్
ఎన్డీఏ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్పై కాంగ్రెస్ నేత శశిథరూర్ ఘాటుగా స్పందించారు. ఆ లెక్కలన్నీ తప్పేనని అన్నారు. ఈ సందర్భంగా గతవారం ఆస్ట్రేలియాలో 56 సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన విషయాన్ని గుర్తు చేశారు. ఓటర్లలో చాలామంది తాము ఏ పార్టీకి ఓటు వేశామన్న విషయాన్ని కరెక్టుగా చెప్పరని థరూర్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా తరహాలోనే ఇక్కడి ఓటర్లు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో తెలుసుకునేందుకు మే 23 వరకు వేచిచూడాలని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.