39 ఏళ్ల తర్వాత తీర్పు: సంచలనం సృష్టించిన ఫూలన్ దేవి- ఠాకూర్ల ఊచకోత కేసు
లక్నో/ఢిల్లీ: దాదాపు 39 ఏళ్ల తర్వాత బందిపోటు రాణి ఫూలన్ దేవికి సంబంధమున్న భీమాయ్ ఊచకోత ఘటనపై శనివారం తీర్పు వెలువడనుంది. ఒకవేళ నేరం రుజువైనట్లు న్యాయస్థానం భావించి ఫూలన్ దేవికి శిక్ష విధించాలన్నా ఆమె బతికిలేదు. ఈ కేసులో సాక్షులు కూడా ఎవరూ ప్రాణాలతో లేరు. ఇంతకీ ఆ ఘటన ఏంటి..? ఫూలన్దేవికి సంబంధం ఏమిటి..?
1981లో ఠాకూర్ల ఊచకోత
అది 1981వ సంవత్సరం ఫిబ్రవరి 14. ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ ప్రాంతంలోని భీమాయ్ గ్రామంలో ఠాకూర్ల ఊచకోత జరిగింది. మొత్తం 20 మంది ఠాకూర్లు హత్యకు గురయ్యారు. దీని వెనక బందిపోటు రాణి ఫూలన్ దేవి హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ. అయితే ఫూలన్ దేవిపై అదే ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు బందిపోటు దొంగలు లాలా రామ్, శ్రీరామ్లు అత్యాచారం చేశారు. ఇందుకు ప్రతీకారంగా ఫూలన్ దేవీ వారి సామాజిక వర్గానికి చెందిన 20 మంది ఠాకూర్లను ఊచకోత కోసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన వారు అగ్రకులాల వారిని ఊచకోత కోయడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది.
ప్రతీకార చర్యలో భాగంగానే ఠాకూర్ల ఊచకోత
84 గ్రామాల్లో నివసించే ఠాకూర్లను అంతమొందించేందుకు గాను సమాజంలో వెనకబడిన సామాజిక వర్గం ముఖ్యంగా మల్లా సామాజిక వర్గంకు చెందిన వారు అంతా ఏకమై అగ్రకులానికి చెందిన ఠాకూర్లపై ప్రతీకారచర్యలకు దిగారు. ఫూలన్ దేవిపై జరిగిన సామూహిక అత్యాచరంకు ప్రతీకారం తీర్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మూడు దశాబ్దాల పాటు కోర్టుల్లో మగ్గిన ఈ కేసులో తీర్పు జనవరి 6వ తేదీన వెలువడాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాలతో శనివారానికి వాయిదా పడింది. ఇప్పటికే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 మందిలో 17 మంది చనిపోయారు. కేసులో ప్రధాన ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫూలన్ దేవి కూడా 2001లో హత్యకు గురైంది. ఇక ప్రత్యక్ష సాక్షులు కింద ఉన్న ఐదుగురిలో నలుగురు చనిపోయారు.
1983లో మధ్యప్రదేశ్ పోలీసులకు లొంగిపోయిన ఫూలన్ దేవి
అప్పట్లో సంచలనం సృష్టించిన 20 ఠాకూర్ల హత్య రాజకీయరంగును పులుముకుంది. ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ఉన్న వీపీ సింగ్ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. ఊచకోత జరిగిన రెండేళ్ల తర్వాత అంటే 1983లో ఫూలన్ దేవి మధ్యప్రదేశ్ పోలీసులకు క్షమాభిక్ష పథకం కింద లొంగిపోయింది. ఉత్తర్ ప్రదేశ్ జైలుకు కాకుండా ఫూలన్ దేవి విన్నపం మేరకు గ్వాలియర్ జైలులో ఆమెను ఉంచేందుకు అప్పటి సీఎం అర్జున్ సింగ్ ఆమోదం తెలిపారు. దాదాపు 11 ఏళ్లు గ్వాలియర్ మరియు జబల్ పూర్ జైలులోనే ఫూలన్ దేవి ఉన్నింది. విచారణ ఎదుర్కోకుండానే ఆమె 1994లో విడుదల అయ్యింది. ఇక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఇంకా జైలులోనే ఉన్నారు. వీరిపై 2012లో చార్జిషీటు దాఖలు చేయడం జరిగింది.
1996లో ఫూలన్ దేవి రాజకీయ అరంగేట్రం
1996లో ఫూలన్ దేవి రాజకీయ అరంగేట్రం చేశారు. సమాజ్ వాదీ పార్టీ తరపున అప్పటి ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆమెకు పిలిచి పార్టీ టికెట్ కేటాయించారు. ఆమెపై ఉన్న కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ములాయం సింగ్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసిన ఫూలన్ దేవి 1996లో మీర్జాపూర్ నియోజకవర్గం నుంచి ఒకసారి 1999లో రెండో సారి అదే స్థానం నుంచి లోక్సభకు ఎన్నికైంది. ఇక 2001 జూలై 26న ఢిల్లీలోని తన అధికారిక బంగ్లా ఎదుటే ఆమె శతృవులు కాల్చి చంపారు. 1994లో ఫూలన్ దేవి జీవితం ఆధారంగా బాండిట్ క్వీన్ అనే సినిమా కూడా విడుదలైంది.