తీర్పుపై అద్వానీ అనూహ్య రియాక్షన్ - బీజేపీ నేత ఇంటి వద్ద భారీ హడావుడి - ఈ ఐదు పాయింట్లే కీలకం
దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి, రెండు మతాల మధ్య విభేదాలను తీవ్రతరం చేసిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. బాబ్రీ కూల్చివేత ఘటనలో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ సంఘ్ నేతలు 32 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సాధారణంగా సీబీఐ కోర్టుల్లో మెజార్టీ తీర్పులు సీబీఐ దర్యాప్తును సమర్థించేవేకాగా.. రాజకీయాలతో ముడిపడి ఉన్న ఈ కేసులో మాత్రం దర్యాప్తు సంస్థకు చుక్కెదురు కావడం గమనార్హం. తీర్పుతో కాషాయశ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లివిరిసాయి.
Recommended Video
బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు: కుట్రదారులు దేశానికి క్షమాపణ చెప్పాలన్న యూపీ సీఎం యోగీ
ఆయన వల్లే ఉద్యమానికి ఊపు..
90వ దశకంలో తన రథయాత్ర ద్వారా హిందూ సమూహాన్ని ఏకం చేసి, రామమందిరం ఉద్యమానికి బీజం వేసిన వ్యక్తి ఎల్కే అద్వానీ. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామజన్మభూమిగా భావించే చోట.. ఆలయాన్ని తొలగించి, నాటి మోఘల్ పాలకులు మసీదు కట్టారన్న వాదనను బలంగా వినిపించడంతోపాటు, అదే చోట మసీదును తొలగించి మందిరాన్ని నిర్మించాని అద్వానీ, ఇతర సంఘ్ నేతల పిలుపుతోనే 1992 డిసెంబర్ లో లక్షలాది మంది కరసేవకులు అయోధ్య పయనమయ్యారు. అదే ఏడాది డిసెంబర్ 6న మసీదు కూల్చివేతకు.. అద్వానీ లాంటి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని సీబీఐ ఆరోపించింది. కానీ లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు మాత్రం సీబీఐ అభియోగాలను తోసిపుచ్చుతూ.. అద్వానీ సహా 32 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
తీర్పుపై అద్వానీ స్పందన ఇది..
బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ, వీహెచ్ పీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ లోని ఇతర నేతల ప్రమేయం ఉందనడానికి తగిన ఆధారాలు లేవని, కాబట్టే వాళ్లను నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి యాదవ్ తీర్పు చెప్పారు. దీనిపై అద్వానీ తనదైన శైలిలో స్పందించారు. జైశ్రీరాం నినాదంతో తన సందేశాన్ని ప్రారంభించారు ‘‘మనస్ఫూర్తిగా కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాను. రామ మందిరం ఉద్యమం పట్ల నా వ్యక్తిగత, బీజేపీ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా ఈ తీర్పును భావిస్తున్నాను. నా చిరకాల కోరిక అయోధ్య మందిరంపై సుప్రీంకోర్టు తీర్పు, ఇటీవలే భూమి పూజ కూడా జరిగిన నేపథ్యంలో ఇంకా మహదానందంగా ఉంది. ఇక భవ్యరామ మందిర నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందాని నా దేశప్రజలతో కలిసి ఎదురుచూస్తున్నాను'' అని అద్వానీ పేర్కొన్నారు.
చాన్నాళ్లకు అక్కడ హడావుడి..
మసీదు విధ్వంసం కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన తర్వాత ఢిల్లీలోని అద్వానీ ఇంటి వద్ద హడావుడి పెరిగింది. 92 ఏళ్ల అద్వానీ.. వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత బుధవారం ఆయన ఇంటికి నేతలు, ప్రముఖుల తాకిడి పెరిగింది. తొలుత కేంద్రం మంత్రి రవిశంకర్ ప్రసాద్.. అద్వానీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి సంతోషాన్ని పంచుకున్నారు. కేంద్రంలోని కీలక నేతలు కూడా ఒక్కొక్కరుగా అద్వానీ ఇంటివైపునకు కదులుతున్నారు. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెద్దాయనను వ్యక్తిగతంగా కలవకపోవడమే మంచిదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
బాబ్రీ తీర్పులో ఐదు అంశాలే కీలకం...
రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపిన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో లక్నో సీబీఐ కోర్టు జడ్జి యాదవ్ ఇచ్చిన తీర్పులో ఐదు అంశాలను కీలకంగా పేర్కొన్నారు. 1.బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరిగిందికాదు. 2.నిందితులు నేరం చేశారనడానికి సరైన ఆధారాలు లేవు. 3.సీబీఐ సమర్పించిన ఆడియోలు, వీడియోలు అథెంటిక్గా లేవు. 4.నిజానికి సంఘవిద్రోహ శక్తులు మసీదును కూల్చివేస్తుంటే, నిందితులుగా ఉన్న వ్యక్తులు దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. 5.నేతల స్పీచ్ ఆడియోలు క్లియర్ గా లేవు. ఈ ఐదు కారణాలతో అద్వానీ సహా 32 మందిని నిర్దోషులుగా కోర్టు పేర్కొంది.