అక్రమాస్తుల కేసు: జయలలిత ఆస్తుల స్వాధీనానికి రంగం, అక్కడ పెద్ద ఎత్తున ప్రాపర్టీ
చెన్నై: అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితకు రూ.100 కోట్ల జరిమానా విధించిన నేపథ్యంలో వసూలు చర్యలు ప్రారంభమయ్యాయి. అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, మరో ఇద్దరిపై ట్రయల్ కోర్టు ఆర్డర్ను సుప్రీం కోర్టు సమర్థించిన ఏడాది తర్వాత వసూలు చర్యలు ప్రారంభించారు.
చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్ సహా ఆరు జిల్లాల్లోని 68 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది. ఇప్పుడు ఆ ఆస్తులను అధికారులు పరిశీలించారు. త్వరలో జయలలితకు విధించిన జరిమానా వసూలుకు వీటని ఏ మేరకు స్వాధీనం చేసుకోవాలనే అంశాన్ని తేలుస్తారు.
అక్రమాస్తులపై కేసు
జయలలిత 1991 నుంచి 96 మధ్య సీఎంగా ఉన్నప్పుడు ఆదాయానికి మించిన రూ.66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. జయలలితతో పాటు శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్లకు కూడా ఈ అక్రమాస్తుల వ్యవహారంలో సంబంధం ఉందంటూ కేసు నమోదైంది.
జయలలితకు రూ.100 కోట్ల జరిమానా
దాదాపు ఇరవై ఏళ్ల పాటు విచారణ జరిగింది. అనంతరం ఈ కేసులో గత ఏడాది ఫిబ్రవరి 14న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. జయ, శశికళ, ఇళవరసి, సుధాకరన్ నలుగురూ అక్రమాస్తులను కూడబెట్టినట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. జయలలిత 2016లోనే మృతి చెందటంతో ఆమెకు రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ సుప్రీం ఆదేశించింది.
ఆస్తుల స్వాధీనానికి చర్యలు
శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించింది. 2017లో కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్లో జయకు విధించిన రూ.100 కోట్ల జరిమానాను వసూలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో నిందితులైన నలుగురి ఆస్తులను స్వాధీనం చేసుకునే చర్యలను తమిళనాడు ప్రభుత్వం చేపట్టింది.
పెద్ద మొత్తంలో ఆస్తులు
మొదటి విడతగా వారికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ఏ ఆస్తులు ఉన్నాయనే వివరాలను అధికారులు సేకరించడం ప్రారంభించారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరునెల్వేలి, తంజావూరు, నీలగిరి మొదలగు ప్రాంతాల్లో వారికి పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.