బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషికపూర్కు అస్వస్థత.. ముంబై ఆసుపత్రిలో చేరిక..
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్(67) బుధవారం(ఏప్రిల్ 29) ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన అనారోగ్య కారణాల గురించి స్పష్టమైన వివరాలేవీ తెలియరాలేదు. 'ఆయన ఆసుపత్రిలో చేరారన్నది నిజం. ప్రస్తుతం హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.' అని రిషి కపూర్ సోదరుడు రధిర్ కపూర్ వెల్లడించారు.
ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఉందా అని రధిర్ కపూర్ను మీడియా ప్రశ్నించగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాధానమిచ్చారు. అయితే కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారని.. శ్వాసకోశ సమస్య కూడా ఉందని చెప్పారు.
అమెరికాలో క్యాన్సర్ చికిత్స తర్వాత గతేడాది సెప్టెంబర్లో రిషి కపూర్ ఇండియా తిరిగొచ్చారు. దాదాపు ఏడాది కాలం పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యం కారణంగా రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. మొదట ఢిల్లీలో ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొన్న సందర్భంలో ఇన్ఫెక్షన్ బారిన పడటంతో అక్కడే ఓ ఆసుపత్రిలో చేర్చారు.
అనంతరం ముంబై తిరిగొచ్చాక.. వైరల్ ఫీవర్తో మరోసారి ఆసుపత్రిలో చేరారు. అయితే కొద్దిరోజులకే డిశ్చార్జి అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రిషి కపూర్ చివరిసారిగా ఏప్రిల్ 2న ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. తన ఆరోగ్యం పట్ల కుటుంబం,అభిమానులు,స్నేహితులు చూపుతున్న శ్రద్దకు తాను చాలా సంతోషిస్తున్నానని అందులో తెలిపారు. ఇటీవలే తన కొత్త సినిమా ప్రాజెక్టును కూడా ప్రకటించారు. హాలీవుడ్లో చేయబోయే 'ది ఇంటర్న్' అనే ఆ సినిమాలో దీపికా పదుకొణేతో కలిసి నటించబోతున్నారు.
Recommended Video
Maharashtra: Veteran actor Rishi Kapoor hospitalised at H. N. Reliance Foundation Hospital in Mumbai. More details awaited. (file pic) pic.twitter.com/zGwKCwhIVE
— ANI (@ANI) April 29, 2020