పార్లమెంట్ లో ఖార్గే అడుగు పెట్టలేరు: ప్రధాని మోడీ చెప్పారు, బీజేపీ చేసి చూపించింది, కాంగ్రెస్ !
న్యూఢిల్లీ: లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖార్గే వచ్చే పార్లమెంట్ సమావేశాలకు హాజరుకారని గత పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సభలో చెప్పారు. చెప్పినట్లు గానే లో 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్లిఖార్జున్ ఖార్గే 95, 452 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ సమావేశాల్లో చెప్పిన మాటను కర్ణాటక బీజేపీ నాయకులు తూచా తప్పకుండా పాటించారని సమాచారం.
ఓటమి ఎరుగని రారాజు
మల్లిఖార్జున్ ఖార్గే నేటి వరకు12 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 1972 నుంచి 2014 వరకు 9 శాసన సభ ఎన్నికలు, రెండు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి ఎరుగని రారాజుగా అందరి దగ్గర పిలింపుచుకున్నారు. అయితే మొదటి సారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ ఉమేష్ జాదవ్ చేతిలో 2019 లోక్ సభ ఎన్నికల్లో మొదటి సారి ఓటమి అంటే ఏమిటో రుచి చూశారు. మల్లికార్జున్ ఖార్గే ఓటమి ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకుల ఓటిమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మోడీకి ఇబ్బంది
పల్లి నుండి ఢిల్లీ వరకు మల్లికార్జున్ ఖార్గేని ఓటమి ఎరుగని రారాజు అని పిలుస్తుంటారు. అయితే ఖార్గేకి మొదటి సారి ఓటమి రుచి చూపించారు. గత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున్ ఖార్గే పార్లమెంట్ సమావేశాల్లో అధికార పార్టీని, మోడీని ఇరుకున పెడుతూ అనేక ప్రశ్నలు వేశారు. ఆ సందర్బాల్లో సమాధానాలు చెప్పలేక ప్రధాని నరేంద్ర మోడీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మోడీ ఆదేశాలు
అదే పార్లమెంట్ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ సమావేశాలకు మల్లికార్జున్ ఖార్గే రారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్లికార్జున్ ఖార్గే గెలవకూడదని కర్ణాటక బీజేపీ నాయకులు సమాచారం అందిందని తెలిసింది.
ఢిల్లీ ఆదేశాల మేరకు ఓటమి ఎరుగని రారాజును ఓడించడానికి డాక్టర్ ఉమేష్ జాదవ్ ను సిద్దం చేశారు. మల్లికార్జున్ ఖార్గేతో పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన డాక్టర్ ఉమేష్ జాదవ్ ను బీజేపీ లోకి తీసుకు వచ్చి అనుకున్న పని చేసి మల్లికార్జున్ ఖార్గేని చాకచక్యంగా ఓడించారు.
కాంగ్రెస్ కు అవమానం
మల్లికార్జున్ ఖార్గేని ఓడిస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని అవమానించినట్లు అవుతందని బీజేపీ నాయకుల ప్లాన్. మల్లికార్జున్ ఖార్గేని ఓడించడంలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ కలబురిగిలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ప్రసంగించారు. కలబురిగిలో మోడీ సమావేశం అనంతరం కర్ణాటక బీజేపీ నాయకుల సైతం ఖార్గే ఓటమికి పక్కాప్లాన్ వేశారు. అనుకున్నట్లే ఖార్గేని ఓడించి మోడీకి బహుమతి ఇచ్చామని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు.
కుల రాజకీయాలు
కలబురిగి లోక్ సభ నియోజక వర్గంలో అన్ని కులాల వారిని ఏకం చెయ్యడంలో బీజేపీ నాయకులు విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప (లింగాయుత కులస్తులు), మాలికయ్య గుత్తేదార్ (ఈడిగ కులస్తులు), బాబురావ్ చించననూరు (కోలి కులస్తులు), డాక్టర్ ఎబి. మాలక రెడ్డి (లింగాయుత రెడ్డి) కులస్తులను ఏకం చేసి డాక్టర్ ఉమేష్ జాదవ్ గెలుపు కోసం పని చేసే విదంగా పావులు కదిపారు. కుల సమీకరణాలతో పాటు బీజేపీ ఓటు బ్యాంకు తోడుకావడంతో ఉమేష్ జాదవ్ గెలుపు నల్లేరు మీద నడక అయ్యింది.
కొడుకు దెబ్బ
కలుబురిగిలో ఇన్ని సంవత్సరాలు ఖార్గే చేసిన అభివృద్ది గురించి ఈ ఎన్నికల్లో మాట్లాడలేదు. ఇఎస్ఐ ఆసుపత్రి, రైల్వే శాఖ అభివృద్ది పనులు ఈ ఎన్నికల ప్రచారంలో పని చెయ్యలేదు. కేవలం కుల సమీకరణాలే ఖార్గే కొంప ముంచాయి. అంతే కాకుండా ఖార్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే పెద్దలకు గౌరవం ఇవ్వరని, అతనికి నిత్యం సుఖాల వ్యామోహం ఎక్కవ అయ్యిందని బీజేపీ ప్రచారం చేసింది. కొడుకు ప్రియాంక్ ఖార్గే దెబ్బ కూడా మల్లికార్జున్ ఖార్గే మీద పడిందని ప్రచారం జరుగుతోంది.