9ఏళ్లుగా కోమాలో!: మాజీ కేంద్రమంత్రి ప్రియరంజన్ మృతి..
తొమ్మిదేళ్లుగా కోమాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రియరంజన్ దాస్మున్షీ(72) సోమవారం కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మున్షీ ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్లో ఆదివారం
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్లుగా కోమాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రియరంజన్ దాస్మున్షీ(72) సోమవారం కన్నుమూశారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మున్షీ అపోలో హాస్పిటల్లో ఆదివారం అర్థరాత్రి 12.10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రియరంజన్ మరణాన్ని ఆయన భార్య దీపా దాస్మున్షీ ధ్రువీకరించారు. అంతా సవ్యంగానే జరుగుతోందనుకున్న సమయంలో ఆయన మరణం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జర్మనీ నుంచి వైద్యులను తీసుకొచ్చి మరీ చికిత్స అందిస్తున్నామని.. అయినా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని అన్నారు.
సాధారణంగా కణజాలానికి చేసే చికిత్స మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, కానీ ఆయనపై అది అంతగా ప్రభావం చూపలేదని దీపాదాస్ మున్షీ చెప్పారు. ప్రస్తుతం లేడీ హార్డింజ్ హాస్పిటల్లో ఉన్న ఆయన మృతదేహాన్ని ఈ రోజు రాత్రికి కోల్కతాకు తరలించనున్నారు.
కాగా, 2008 నుంచి మున్షీ కోమాలోనే ఉన్నారు. తీవ్రమైన గుండెపోటు కారణంగా పక్షవాతానికి గురై కోమాలోకి వెళ్లారు. అలా తొమ్మిదేళ్లుగా ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు.
రాజకీయాల విషయానికొస్తే.. 1999-2009వరకు ఎంపీగా, మన్మోహన్సింగ్ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, 2004-2009 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా మున్షి సేవలందించారు. పశ్చిమ బెంగాల్ లోని రాయ్ గంజ్ నియోజకవర్గం నుంచి ఆయన లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు.
2008లో ఆయన అనారోగ్యం పాలవడంతో.. 2009ఎన్నికల్లో ఆయన భార్య దీపా దాస్ మున్షీ ఎన్నికల్లో పోటీ చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అధ్యక్షుడిగానూ మున్షీ సేవలందించారు. మున్షీ మరణం పట్ల ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు.