తమిళనాడు సీపీఐ వెటరన్ పాండియన్ కన్నుమూత -రాజీవ్ గాంధీ హత్య సమయంలో స్టేజీపై..
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ఓ కమ్యూనిస్టు యోధుడిని కోల్పోయింది. సీపీఐ సీనియర్ నేత డీ పాండియన్ (89) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతూ, చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన గురువారం కన్నుమూశారు. పాండియన్కు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. పాండియన్ మృతిపై సీపీఐ, సీపీఎం సహా పలు రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. స్వగ్రామం వెల్లాయ్మలయ్పట్టిలో పాండియన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కమ్యూనిస్టు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పాండియన్.. 1953లో కాలేజీ రోజుల్లోనే విద్యార్థి నేతగా పనిచేశారు. ఉద్యమాల్లో పాల్గొంటూనే చదువు కొనసాగించి, ఇంగ్లీష్ టీచర్ గా ప్రభుత్వం ఉద్యోగం కూడా సంపాదించారు. కానీ, తర్వాతి కాలంలో ఉద్యోగం వదిలేసి, పూర్తిస్థాయిలో క్రియాశీలరాజకీయాలకు పరిమితం అయ్యారు. 1989లో, 1991లో రెండుసార్లు ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు.
తమిళనాడులోని పెరంబదూర్ లో 1991లో రాజీవ్గాంధీ హత్య జరిగిన సమయంలో పాండియన్ ఆ స్టేజీ మీదనే ఉన్నాడు. రాజీవ్ ప్రసంగాన్ని తమిళంలోకి అనువాదం చేస్తూ మరో పోడియం ముందు నిలబడి ఉన్న పాండియన్.. నాటి పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో పాండియన్ కూడా చనిపోయారని కోయంబత్తూర్ అధికారులు ప్రకటించారు. కానీ, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడని తెలుసుకుని మృతుల జాబితా నుంచి ఆయన పేరును తొలగించారు.