మోడీనే స్ఫూర్తి: బీజేపీలో చేరిన ప్రముఖ నటి మహాశ్వేత
భువనేశ్వర్: ఒడిశా సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నటి మహాశ్వేతా రే భారతీయ జనతా పార్టీలో చేరారు. సోమవారం భువనేశ్వర్లో బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్, ఇతర నాయకుల సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భావజాలమేంటో తనకు తెలియదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధి కోసం పాటుపడుతున్నారని, ఆయన ఆలోచన విధానం, పాలన పట్ల ఆకర్షితురాలినై ఆయన సారథ్యంలో పనిచేసేందుకు పార్టీలో చేరానని చెప్పారు.
ఈ సందర్భంగా ధర్మేంద్రప్రదాన్ మాట్లాడుతూ.. పార్టీలోకి మహాశ్వేతా రే రాక సంతోషాన్నిచ్చిందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆమె కృషిచేస్తారని వ్యాఖ్యానించారు. ప్రముఖ నటులు మిహిర్దాస్, అను చౌదురిలు జనవరిలోనే బీజేపీలో చేరడం గమనార్హం.
కాగా, ఒడిశా సినీ పరిశ్రమలో మహాశ్వేతా రేకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొన్ని బెంగాలీ చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ఇటీవలే 'దేలే కథా సారే'లో ఆమె నటనకు ఉత్తమనటి అవార్డు లభించింది.