VG Siddhartha Missing: ఆపరేషన్ సిద్ధార్థ: ఒక్కరి కోసం 150 మంది! అయినా దొరకని జాడ
బెంగళూరు: కేఫ్ కాఫీ డే రెస్టారెంట్ల అధిపతి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన కర్ణాటకలోని మంగళూరు సమీపంలో గల నేత్రావతి బ్రిడ్జిపై చివరిసారిగా కనిపించారు. అప్పటి నుంచి మాయం అయ్యారు. సిద్ధార్థ కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టారు. నేత్రావతి నదిలో దూకి సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటూ అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ- ఆయన జాడ కానరాలేదు. సంఘటన చోటు చేసుకున్న ప్రదేశం నుంచి సముద్రం కిలోమీటరు దూరంలో ఉండటం, నేత్రావతి నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటం వల్ల సిద్ధార్థ కనిపిస్తారనే ఆశలు అడుగంటుతున్నాయి.
అగ్గి రాజేసిన యడియూరప్ప: టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు రద్దు!
150 మందికి పైగా బలగాలు..
ఆపరేషన్ సిద్ధార్థ పేరుతో భద్రతా బలగాలు గాలింపు చర్యలను చేపట్టాయి. ఆరంభంలో 25 మందితో చేపట్టిన అన్వేషణ చేపట్టారు. సమయం గడుస్తున్నకొద్దీ పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుండటంతో ఈ సంఖ్యను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం 150 మందితో ముమ్మర అన్వేషణ కొనసాగుతోంది. మంగళూరులోని పాండేశ్వర అగ్నిమాపక దళం స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో గాలింపు కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో- పాండేశ్వర అగ్నిమాపక కేంద్రం నుంచి రెస్క్యూ వాహనం, క్విక్ రెస్పాన్స్ వాహనం ఒకటి చొప్పున, రెండు వాటర్ టెండర్లు, బోటుతో కూడిన అయిదు ఓబీఎం వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటితో పాటు 45 మంది అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. వారిలో ప్రాంతీయ అగ్నిమాపక దళాధికారి ఒకరు, జిల్లా ఫైర్ అధికారి, ఫైర్ స్టేషన్ అధికారి, అసిస్టెంట్ ఫైర్ స్టేషన్ అధికారులు నలుగురు, లీడింగ్ ఫైర్ మెన్-7, ఫైర్ మెన్ డ్రైవర్-10, డ్రైవర్ మెకానిక్-1, ఫైర్ మెన్-18 మంది ఉన్నారు.
ఎన్టీఆర్ఎఫ్ బలగాలు సైతం రంగంలోకి..
వీజీ సిద్ధార్థ కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు కూడా కలిశాయి. 27 మంది ఎన్టీఆర్ఎఫ్ జవాన్లు, నాలుగు బోట్లు, గజ ఈతగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. కరావళి తీర ప్రాంత బలగాలకు చెందిన రెండు కోస్టల్ గార్డ్ షిప్స్, హెలికాప్టర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల హెలికాప్టర్ ను గాలింపు చర్యల్లోకి వినియోగించట్లేదు. 12 మంది హోమ్ గార్డులు, నలుగురు గజ ఈతగాళ్లు, 106 మంది రాష్ట్ర పోలీసులు నిరంతరం అన్వేషణను కొనసాగిస్తున్నారు. ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, మరో ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు, 50 మందికి పైగా ఆర్మ్డ్ పోలీసు కానిస్టేబుళ్లు గాలింపు చర్యలను చేపట్టారు.