ఏపి సీఎం నిర్ణయంపై మండిపడ్డ వీహెచ్..! ఫాక్షన్ ఆలోచనలు మానుకోవాలని హితవు..!!
అమరావతి/హైదరాబాద్: ఏపిలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చు రేగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రాజీవ్ మెమోరియల్ భవన్ను కూల్చాలన్న జగన్ నిర్ణయం ఫ్యాక్షన్ ఆలోచనకు అద్దం పడుతోందని వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ వల్లే వైఎస్ఆర్ పీసీసీ చీఫ్ అయ్యారని, సోనియా దయతోనే వైఎస్ సీఎం అయ్యారనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హితవుచెప్పారు.
రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచివి కాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై జగన్ దృష్టి సారించాలని, కూల్చివేతలపై కాదన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు.ఇదిలా ఉండగా శాసనసభలో అనుసరించాల్సిన నిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలని, అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామని తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభలో అవకాశాలు దక్కాలంటే చేయి పైకి ఎత్తితే చాలు అని అనుకోకూడదని, నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే ఆ అవకాశం దక్కుతుందని ఏపి సీఎం జగన్ అన్నారు.