వన్ మెన్ షో: నరేంద్ర మోడీపై వీహెచ్ ఫైర్, కెసిఆర్పై పొన్నాల
న్యూఢిల్లీ/మెదక్: ప్రధాని నరేంద్ర మోడీ వన్ మెన్ షో చేస్తున్నారని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మోడీని అడగందే ఏ కేంద్రమంత్రి కూడా నోరు విప్పరని అన్నారు. ఏ మంత్రి కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేరని ఆరోపించారు.
మోడీ ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుకుంటుందనే విషయం త్వరలోనే తెలుస్తుందని హనుమంతరావు అన్నారు. గతంలో వ్యతిరేకించిన కార్యక్రమాలను.. మోడీ ఇప్పుడు చేస్తున్నారని ఆయన అన్నారు.
బండారం బయటపెడ్తాం: కెసిఆర్పై పొన్నాల
మెదక్: ఆచరణలో సాధ్యాం కాని హామీలతో తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రయోజనం లేని బడ్జెట్ను ప్రవేశపెట్టారని కెసిఆర్పై మండిపడ్డారు.
వచ్చే మార్చిలో కెసిఆర్ బండారం బయటపెడ్తామని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రైతుల ఆత్మహత్యల వివరాలు కెసిఆర్ దగ్గర లేవనడం సిగ్గు చేటని కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ విమర్శించారు.
ఎంఐఎంను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోగలరా?: నిరంజన్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిరంజన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. ఎంఐఎం నేతల ఆస్తులు కాపాడేందుకే టిఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చిందని ఆరోపించారు. ఎంఐఎంను సంప్రదించకుండా మెట్రో రైలు ప్రాజెక్టు మార్పులపై నిర్ణయం తీసుకునే దమ్ము సిఎం కెసిఆర్కు ఉందా అని ప్రశ్నించారు.
ఇది ఇలా ఉండగా విద్యుత్ సమస్య, పింఛన్లు, రుణమాఫీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శంకర్రావు కోరారు. రుణమాఫీపై ప్రభుత్వమే బ్యాంకులకు వారెంటీ ఇవ్వాలన్నారు. పింఛన్లు అందక వృద్ధులు చనిపోతున్నారని ఆయన చెప్పారు.