‘మాకు హితబోధ చేసే ముందు నల్లజాతివారిపై దాడులు ఆపండి’
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల భారత్పై వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మత సహనంపై భారత్కు హితబోధలు చేసే ముందు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నల్లజాతివారిపై ఇప్పటికీ దాడులు జరుగుతున్న తమ దేశం గురించి ఆలోచిస్తే మంచిదంటూ విశ్వ హిందూ పరిషత్ ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
మిషనరీల కార్యకలాపాలకు తోడ్పడేందుకు చర్చి చొప్పించిన కొంతమందిని కలిసిన తర్వాత ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారని విహెచ్పి సంయుక్త కార్యదర్శి సురేంద్ర జైన్ శుక్రవారం అన్నారు. రాజకీయాల్లోకి చర్చి చొప్పించిన వారుగా అనుమానాలున్న అలాంటి వారి పేర్లను ప్రభుత్వం బైటపెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
భారత్కు హితబోధలు చేసే ముందు ఒబామా అమెరికాలోని తన సొంతవారి గురించి ఆలోచించాలని, ఒక వేళ ఆయన హితబోధ చేయాలనుకుంటూ ఉంటే అమెరికా సాయంతో మత మార్పిడులు జరపడమే కాకుండా జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న క్రైస్తవ మిషనరీలకు హితబోధ చేయాలని జైన్ చెప్పారు.
‘ఒబామా స్వయంగా నల్లజాతి వారు. అయినప్పటికీ నల్లజాతి వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపలేక పోతున్నారు' అని జైన్ ఆరోపించారు. భారత దేశంలో ఇటీవలి సంవత్సరాల్లో వివిధ మతాల వారిపై చోటు చేసుకుంటున్న ‘అసహన చర్యల'పై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.