అమీర్ 'పీకే' చిత్రంపై ఉత్తరాది భగ్గు, థియేటర్లపై రాళ్లు: వీహెచ్పీ లేఖ
ముంబై/అహ్మదాబాద్: బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం పైన హిందుత్వవాదులు భగ్గుమంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పీకే సినిమాను నిలిపివేయాలని బంజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అహ్మదాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో వారు నిరసనలు చేపట్టారు.
పీకే చిత్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని వారు ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న సీన్లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వారు ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాశారు.
విశ్వహిందూ పరిషత్ రాసిన లేఖలో... పీకే చిత్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. లేఖ పైన విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధులు వినోద్ బన్సాల్, విజయ శంకర్ తివారీ తదితరులు సంతకాలు చేశారు.
హిందువుల మనోభావాలు కించపరిచేలా సినిమాలు తీస్తున్నప్పటికీ సెన్సార్ బోర్డు పట్టించుకోవడం లేదన్నారు. ఈ చిత్రాన్ని నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని బన్సాల్ చెప్పారు. కాగా, బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఈ చిత్రం బాగుందని కితాబిచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు సెన్సార్ బోర్డు కూడా దీని పైన స్పందించింది. సెన్సార్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్ పర్సన్ లిలీ శాంసన్ మాట్లాడుతూ.. ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సన్నివేశాలు తొలగించమని చెప్పారు. ఈ చిత్రాన్ని ఆపేయాలని లేదా సన్నివేశాలు కట్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. థియేటర్ల వద్ద ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వారు.