బెంగళూరుకు రావొద్దు: వీహెచ్పీ నేత తొగాడియాకు నోటీసులు
బెంగళూరు: సీనియర్ విశ్వహిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియాకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నగరంలోకి రావొద్దని మంగళవారం నోటీసులు ఇచ్చారు. బెంగళూరులో ఫిబ్రవరి 8న జరగనున్న హిందూ విరాట్ సమావేశాలకు ఆయన హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 5 నుండి 8వ తేదీ వరకు రావొద్దని సూచించారు.
అయితే, తొగాడియా రావొద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రవీణ్ తొగాడియా వస్తే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారని, ఆయన పైన పలు కేసులు ఇప్పటికే నమోదై ఉన్నాయని చెబుతున్నారు. వీహెచ్పీ ఇటీవల ఘర్ వాపసీని ఉధృతం చేసిన విషయం తెలిసిందే. కర్నాటకలోని గుల్బర్గాలో 471 కుటుంబాలను తిరిగి హిందూమతంలోకి తీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
కాగా, తొగాడియాకు బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో ఈ నోటీసులు ఇచ్చారు. తొగాడియా పైన విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులు ఉన్నాయని, ఇప్పుడు కూడా అలాంటివి చేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.