గాంధీ ఓ బ్రిటిష్ ఏజెంట్: మొన్న ఖట్జూ, నేడు వీహెచ్పీ నేత సాధ్వి ప్రాచీ
లక్నో: విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచీ మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని ఓ బ్రిటిష్ ఏజెంట్గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోని బహురైక్ జిల్లాలో జరిగిన హిందూ సమ్మేళన్లో పాల్గొన్న సాధ్వి ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.
మహాత్మాగాంధీ చరఖా వడకటం వల్ల బ్రటీష్ పాలన నుంచి భారత్కు స్వాతంత్ర్యం రాలేదన్నారు. వీర్ సావర్కర్, భగత్ సింగ్ వంటి ధైర్యవంతులైన దేశ బిడ్డల త్యాగం ఫలితం వల్లనే స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొన్నారు.
హిందు లేదా ముస్లిం ఎవరైనా సరే కేవలం ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతించాలని సాధ్వి ప్రాచీ అన్నారు. ఇలా కాకుంటే, ఎవరైనా సరే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనేందుకు సిద్ధపడితే ఆ వ్యక్తి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలన్నింటినీ కోల్పోతారని అన్నారు.
"భారత మాతాకీ జై", "వందేమాతరం" లాంటి నినాదాలు చేయని వారు జాతీయ జెండాను అవమానించడం లాంటిదేనని, గోసంరక్షణకు ఉపకరించని వారు భారతదేశంలో నివసించే హక్కు లేదన్నారు.
ఇటీవల కాలంలో సాధ్వి ప్రాచీ వివాదాలకు నిలయంగా మారారు. గతంలో సాధ్వి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు లోక్ సభలో కూడా పెద్ద దుమారాన్నే లేపాయి. గతంలో హిందూ మతాన్ని కాపాడేందు కోసం మహిళలు కనీసం నలుగురు పిల్లలనైనా కనాలని ఆమె పేర్కొన్నారు.
అంతక ముందు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేను అడిగింది నలుగురు పిల్లలను కనమని. 40 మంది కుక్క పిల్లలను కాదు' అని అన్నారు. బిజెపి అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయదని చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్వాది పార్టీ మంత్రి అజాం ఖాన్ను ఘర్ వాపసీ ద్వారా హిందూ మతంలోకి రావాలని సాధ్వి ప్రాచీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఇటీవలే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కేండేయ ఖట్జూ కూడా జాతిపిత మహాత్మా గాంధీని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గాంధీజీ బ్రిటీష్ ఏజెంట్ అని, ఆయన వైఖరితో దేశానికి తీవ్ర నష్టం కలిగించారని ఖట్జూ తన బ్లాగ్లో రాసిన సంగతి తెలిసిందే.
గాంధీజీ రాజకీయాల్లో మతాన్ని చొప్పించేపని కొనసాగించారని, తద్వారా విభజించి పాలించాలనే బ్రిటిష్ పాలకుల వ్యూహం పక్కాగా అమలయ్యేందుకు సహకరించారని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ విధానం పనికి రానిదని, విప్లవాత్మక దిశగా సాగుతున్న స్వాతంత్ర్యోద్యమాన్ని దారి మళ్లించేందుకే ఆయన ఈ విధానాన్ని తీసుకువచ్చారని దుయ్యబట్టారు. సత్యాగ్రహం విధానం వల్ల బ్రిటీష్ పాలకులకే లాభం చేకూరిందన్నారు.
గాంధీ ఆర్థిక విధానాలు దేశాన్ని తిరోగమన దిశలో తీసుకెళ్లేవని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన ప్రకటించిన గ్రామ స్వరాజ్య విధానం కులాలను సమర్థిస్తుందని, అది అమల్లోకి వస్తే గ్రామీణులు భూస్వాములు, షావుకార్ల గుప్పిట్లో చిక్కుకుపోయేవారని ఖట్జూ విశ్లేషించారు.