మీకెందుకంటా: ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను పెళ్లిచేసుకోవాలన్న సాద్వీ ప్రాచీ
ఆగ్రా: ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలు హిందూ సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వీహెచ్పీ మహిళా నేత సాద్వీ ప్రాచీ. ముస్లిం అమ్మాయిలు ముందుగా హిందూ మతాన్ని స్వీకరించి ఆ పై హిందూ మతానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకోవాలన్నారు. అంతేకాదు ఇస్లాం మతం చాలా ప్రమాదకరమైన మతమని జీవితాన్ని ధ్వంసం చేస్తుందనే వ్యాఖ్యలు చేసి మరింత అగ్గి రాజేశారు సాద్వీ.
ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళలు హిందూ మతం స్వీకరిస్తే వారి మతంలో అనాదిగా వస్తున్న ట్రిపుల్ తలాఖ్ నుంచి విముక్తి పొందుతారని ఆమె అబిప్రాయపడ్డారు. లేదంటే జీవితాంతం కష్టాలు, వేదనతోనే బతకాల్సి ఉంటుందని సాద్వీ చెప్పారు. ముస్లిం మత పెద్దలు ఎవరైతే ట్రిపుల్ తలాఖ్ గురించి ప్రస్తావిస్తారో.... వారికో చెంపదెబ్బ ఇవ్వాలని ముస్లిం మహిళలకు ఆమె సూచించారు. అనంతరం మతాన్ని వదిలి వచ్చేయాలని సాద్వీ చెప్పారు.
హమీర్పూర్లోని ఓ దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ పూజలు నిర్వహించారు ఓ బీజేపీ మహిళా ప్రజాప్రతినిధి. దీంతో ఆలయంలోకి మహిళలు ప్రవేశింపరాదన్న నిబంధన ఉండటంతో ఆ ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు. దీనిపై స్పందించిన సాద్వీ... మహిళలప పట్ల ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. బిడ్డకు జన్మనిస్తున్న మహిళ... ఆలయంలోకి ప్రవేశిస్తే తప్పా అని సాద్వీ ప్రశ్నించారు.
ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కూడా సాద్వీ స్పందించారు. ఇది రాజకీయ అంశం కానేకాదని అయితే..రామమందిర నిర్మాణ అంశాన్ని కొందరు తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని సాద్వీ ధ్వజమెత్తారు. కొన్ని కోట్ల మంది ప్రజలు అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పిన సాద్వీ... 2019లో నిర్మాణం జరిగి అదే ఏడాది పూర్తవుతుందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయం కోసమే అంతా ఎదురుచూస్తున్నట్లు సాద్వీ చెప్పారు.