'అయోధ్యలో రామాలయం నిర్మించాలి, బాబ్రీ మరోచోట'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. భూమిని స్వాధీనం చేసుకుని రామమందిర నిర్మాణానికి కేంద్ర పూనుకోవాలని విహెచ్పీ నేత అశోక్ సింఘాల్, భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి బుధవారం డిమాండ్ చేశారు.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. సున్నితమైన ఈ అంశం సుప్రీం కోర్టులో ఉన్నందున తీర్పు తర్వాతే ఎలా ముందుకెళ్లాలన్న దాని పైన ఆలోచిస్తామన్నారు.
ఈలోపు ప్రజా ప్రయోజనం కోసం బాబ్రీ మసీదు ముతావలీ (వంశానుగత పర్యవేక్షకుడు)కి నోటీసులు ఇచ్చి భూమి స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి అశోక్ సింఘాల్ సూచించారు. మరోచోట ముస్లింలకు బాబ్రీ మసీదు నిర్మించేలా చొరవ తీసుకోవాలన్నారు.
రామమందిరం నిర్మించడానికి ఎలాంటి అవరోధాలు లేవని, కేంద్రం చొరవ తీసుకోవాలని, బిజెపి మేనిఫెస్టోలోనూ మందిర నిర్మాణంపై స్పష్టమైన హామీ ఉందని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జనవరిలో ఓ సెమినార్ నిర్వహిస్తామన్నారు.
విరాట్ హిందుస్థాన్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి రామమందిర నిర్మాణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ... మోడీకి రాసిన లేఖకు ఇంతవరకూ జవాబు రాలేదని, బిహార్ ఎన్నికల తర్వాత మరోసారి నా అభిప్రాయం చెబుతానన్నారు. అమిత్ షా దృష్టికి కూడా దీనిని తీసుకెళ్లానని చెప్పారు.