ఇళ్లు, గుళ్లు నిర్మిస్తాం: వీహెచ్పీ, 30న ఖాట్మాండ్కు టెక్కీ నీలిమ
న్యూఢిల్లీ: నేపాల్లో భూకంపం విధ్వంసం కారణంగా కూలిపోయిన ఇళ్లు, దేవాలయాలు, ఇతర పుణ్యక్షేత్రాలను పునర్నిర్మించడంలో ప్రజలకు పూర్తి మద్దతు ఇస్తామని విశ్వహిందూ పరిషత్ ప్రకటించింది. వీహెచ్పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రవీణ్ తొగాడియా మంగళవారం నేపాల్ పర్యటనకు బయలుదేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూకంపం కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను భారత్కు రప్పించి, తమ వసతి గృహాలు, అనాథాశ్రమాల్లో ఉచిత వసతి, విద్యను అందిస్తామని చెప్పారు. ఇళ్లు, పుణ్యక్షేతరాలను పునర్నిర్మిస్తామన్నారు.
30న ఖాట్మాండుకు టెక్కీ నీలిమ
ఎవరెస్టు అధిరోహణకు వెళ్లిన హైదరాబాదుకు చెందిన నీలిమ.. క్షేమంగా ఉన్నానని మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఆమె ఎవరెస్ట్ శిఖరారోహణకు వెళ్లారు. సురక్షితంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా మంగళవారం తన తల్లిదండ్రులకు ఫోన్లో తెలియజేశారు. దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.
మంగళవారం నుంచి కిందకు దిగుతున్నామని, 30వ తేదీకల్లా ఖాట్మండు చేరుకుంటామని ఆమె చెప్పారు. కిందకు దిగుతుండగా ల్యాండ్ ఫోన్ సౌకర్యం లభించడంతో తొలుత బెంగళూరులోని తమ టీమ్ కో ఆర్డినేటర్కు సమాచారం తెలియజేశామన్నారు.
ల్యాండ్ ఫోన్ నిర్వాహకులు ఒక్క నిమిషానికి రూ.150 చార్జీ వసూలు చేశారని చెప్పారు. ఆమె బృందంలోని ఏడుగురు సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. భూకంపం సమయంలో తామంతా బేస్క్యాంపునకు 5,300 మీటర్ల ఎత్తులో ఉన్నామని, రేడియో మినహా కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయని, భూకంప తీవ్రతను రేడియో ద్వారా తెలుసుకున్నామన్నారు.