128 అడుగుల ఎత్తు..212 పిల్లర్లు..5 ప్రవేశాలు: 4ఏళ్ల సమయం: అయోధ్య రామ మందిరానికి వీహెచ్పీ ప్రణాళిక..!
సుప్రీంతీర్పుతో ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎలా ఉండబోతోందనే చర్చ మొదలైంది. అయోధ్య రామ మందిరం కోసం తొలి పోరాటం చేసిన విశ్వహిందూ పరిషత్ ఇప్పటికే రామ మందిరం పైన ఒక ప్రతిపాదన సిద్దం చేసింది. అందులో ఆలయం 128 అడుగుల ఎత్తుతో ఉండనుంది. అదే విధంగా అడుగుల వెడల్పు.. 270 అడుగుల పొడువుతో దీనిని నిర్మించాలని తలపెట్టారు. ఎక్కడా స్టీల్ వినియోగం లేకుండా భారీ నిర్మాణం చేపట్టే విధంగా ప్రణాళికలతో వీహెచ్ పీ సిద్దంగా ఉంది.
సుప్రీం తీర్పుకు అనుగుణంగా ట్రస్ట్ ఏర్పాటు అయిన తరువాత విశ్వ హిందూ పరిషత్..రామజన్మ భూమి న్యాస్ కలిసి సాధ్యమైనంత త్వరలో నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాయి. విశ్వహిందూ పరిషత్ అనేక ప్రణాళికలు సిద్దం చేసినా...అందులో అత్యధిక మంది మనోభావాలు..విశ్వాసాలకు అనుగుణంగా ఉండే ఈ నిర్మాణ బ్లూ ప్రింట్ పైన ఫోకస్ చేసింది. దీనిని అందరి ఆమోదంతో అయోధ్యలో చారిత్రాత్మకం గా రామ మందిరాన్ని నిర్మించాలనేది చాలా కాలంగా విశ్వ హిందూ పరిషత్ ఆలోచన. ఇప్పుడు సుప్రీం తీర్పుతో నిర్మాణం అక్కడ ఖాయంగా ప్రారంభం కానుంది.
సంవత్సరాల పాటు విశ్వ హిందూ పరిషత్ అయోధ్యలో రామాలయం కోసం పోరాడుతూనే ఉంది. గర్భ గుడిలోని మూల విరాట్ సైతం అత్యద్బుతంగా ఉండేలా చూస్తామని విహెచ్ పీ ప్రతినిధులు చెబుతున్నారు. రామాలయంలో నిర్మాణ సమయంలో వినియోగించే తలుపులు..పిల్లర్లు అన్నింటినీ చరిత్రకు అనుగుణంగా.. ప్రత్యేకతలను చాటుతూ సిద్దం చేయటానికి ఇప్పటికే స్పస్టమైన ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. అయితే..రాముడి మూల విరాట్ మాత్రం ఖరారు చేయాల్సి ఉంది.
వీహెచ్ పీ ప్రతిపాదించిన 22 పిల్లర్లు దేవాలయం మొత్తంలో ఏర్పాటు చేస్తారు. రెండు అంతస్తులుగా ఒక్కో అంతస్తులో 106 పిల్లర్లను ఏర్పాటు చేయాలనేది వారి ఆలోచన. ఇప్పటికే సగానికి పైగా పిల్లర్లు సైతం సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయోధ్యలో నిర్మించే భవ్య రామ మందిరానికి పైకప్పును శిఖరం ఆకారంలో వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే సాధువులు..సంత్ లు అభిప్రాయాలు సేకరించి న విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఈ ప్రణాళికలకు దాదాపుగా ఆమోద ముద్ర వేసింది.
ఈ ప్రతిపాదిత ప్రణాళికలో రామ మందిరానికి అయిదు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. సింగ్ ద్వార్, న్రుత్య మండప్, రంద్ మండప్, పరిక్రమ, పూజా గది ఏర్పాటు చేయనున్నారు. రామ్ లల్లా, విగ్రహం కింద అంతస్తులోనే ఏర్పాటు చేయనున్నారు.
ఈ భవ్య రామాలయ నిర్మాణానికి దాదాపు మొత్తంగా 1.75 లక్షల క్యూబిక్ అడుగుల శాండ్ స్టోన్ అవసరమని అంచనా వేసారు. 1990 నుండి దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పుడు తీర్పు అనుకూలంగా వచ్చిన ఉత్సాహంతో మరింత అద్బుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ప్రస్తుతం సిద్దం చేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా దేవాలయం నిర్మాణానికి మరింత మంది అనుభవం ఉన్న నిపుణులు..శిల్పులు..కళాకారుల సలహాలు తీసుకోనున్నారు. మొత్తంగా ఈ మొత్తం దేవాలయం నిర్మాణం పూర్తి చేయటానికి నాలుగేళ్ల కాలం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికిప్పుడు రామాలయం నిర్మాణం ప్రారంభమయే సమయం..పనులు ప్రారంభించేది..పూర్తి చేసేది చెప్పలేమని విశ్వ హిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ చెబుతున్నారు. అయితే, కోర్టు తీర్పుకు అనుగుణంగా న్యాయ ప్రక్రియ..అధికార విధివిధానాలు పూర్తి చేసుకొని సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేసారు.
భవ్యమైన రామ మందిరంలో రాముడి దివ్య విగ్రహం ఏర్పాటు చేయాలని అనేక మంది కోరుకుంటున్నారు. సంవత్సరాల నిరీక్షణ తరువాత దక్కిన ఫలితం కారణంగా..దేవాలయాన్ని.. ప్రధాన విగ్రహాన్ని మరింత సుందరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే కింది అంతస్తు కు సంబంధించిన నిర్మాణానికి అన్ని సిద్దంగా ఉన్నాయి. కార్యశాల ప్రారంభించటానికి అవసరమైన రాళ్ల తరలింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో..త్వరలో ఈ నిర్మాణం ప్రారంభించటానికి అన్ని రకాల ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయని..ఇక క్షేత్ర స్థాయిలో అధికారిక అనుమతులు తీసుకొని..నిర్మాణం ప్రారంభించటమే మిగిలి ఉందని విహెచ్ పీ నేతలు చెబుతున్నారు.