జార్ఖండ్ ఎఫెక్ట్?: బీజేపీ సంకీర్ణ కూటమి సర్కార్ లో లుకలుకలు: మిత్రపక్షంలో తిరుగుబాటు: రాజీనామా..!
చండీగఢ్: భారతీయ జనతా పార్టీకి షాకుల మీద షాకులు తగులుతూనే వస్తున్నాయి. జార్ఖండ్ లో తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అక్కడ అధికారాన్ని కోల్పోయిన ప్రభావం.. హర్యానా మీద పడినట్టు కనిపిస్తోంది. బీజేపీ పొత్తు పార్టీ జన్ నాయక్ జనతా పార్టీలో లుకలుకలు ఆరంభం అయ్యాయి. తిరుగుబాటుగా మారనున్నాయి. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా వైఖరికి నిరసనగా పార్టీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే రామ్ కుమార్ గౌతమ్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
ముహూర్తం ఫిక్స్: హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీగా దుష్యంత్ ప్రమాణాస్వీకారం
జన్ నాయక్ జనతా పార్టీ మీదే బీజేపీ ఆధారం..
హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానాలో బీజేపీ..జన్ నాయక్ జనతా పార్టీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మొన్నటి హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించలేక పోయింది బీజేపీ. అదే సమయంలో 10 స్థానాలను సాధించిన జన్ నాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా కింగ్ మేకర్ గా ఆవిర్భవించారు. ఆయన ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి ఏర్పడింది.
సంకీర్ణ కూటమి సర్కార్ లో ముసలం..
ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయించడం ద్వారా దుష్యంత్ చౌతాలా మద్దతును కూడగట్టింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మనోహర్ లాల్ ఖట్టర్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. అలాంటి సంకీర్ణ కూటమి సర్కార్ లో తాజాగా ముసలం పుట్టుకొచ్చింది. దుష్యంత్ చౌతాలా వైఖరిని తప్పు పడుతూ జన్ నాయక్ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు రామ్ కుమార్ గౌతమ్ తప్పుకొన్నారు. తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన నర్నౌద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
గుర్ గావ్ మాల్ లో కథ నడిపించారంటూ..
బీజేపీకి మద్దతు ఇచ్చే విషయాన్ని దుష్యంత్ చౌతాలా కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులెవరికీ ముందుగా వెల్లడించలేదని రామ్ కుమార్ గౌతమ్ ఆరోపించారు. పార్టీ ఉపాధ్యక్షుడినైన తనకే తెలియదని చెప్పారు. గుర్ గావ్ లోని ఓ షాపింగ్ మాల్ లో దుష్యంత్ చౌతాలా ఒంటరిగా బీజేపీతో మంతనాలు సాగించారని ఆరోపించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ఆయన ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తమకు ముందుగా సమాచారాన్ని ఇచ్చి, రాత్రికి రాత్రి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారని ధ్వజమెత్తారు.