జడ్డీల్ని నియమించుకోనివ్వరా ? సీజేఐ ముందే ఉపరాష్ట్రపతి అసంతృప్తి- ఎక్కడా చూడలేదంటూ..
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్రానికి స్వేచ్ఛనివ్వకుండా సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాలు తీసుకోవడంపై వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ న్యాయనియామకాల కమిషన్ ఎన్జేఏసీని కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహంగా ఉన్న ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కడ్ ఇవాళ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ముందే తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
ఢిల్లీలో ఇవాళ జరిగిన ఎల్ఎం సింఘ్వీ స్మారక ఉపన్యాసంలో ఉపరాష్ట్రపతి ధన్ కడ్ ప్రసంగిస్తూ.. రాజ్యాంగ పీఠికలో "మేము ప్రజలు" అని పేర్కొన్నారని, అలాగే పార్లమెంటు ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా సుప్రీంకోర్టు న్యాయనియామకాల కమిషన్ ఏర్పాటు కోసం పార్లమెంట్ చేసిన చట్టాన్ని కొట్టేసిందన్నారు. అయితే జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత పార్లమెంటులో దీనిపై ఎలాంటి చర్చా లేదన్నారు. ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించేలా పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని సుప్రీంకోర్టు "రద్దు" చేసిందని, ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ నిబంధనలను ఉటంకించిన ఉపరాష్ట్రపతి... చట్టంపై అభ్యంతరాలు ఉంటే సమస్యను కోర్టులు పరిశీలించవచ్చని అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సమక్షంలో ఉపరాష్ట్రపతి ధన్కడ్ మాట్లాడుతూ.. నిబంధనలు రద్దు చేయొద్దని ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. ఎన్జేఏసీ చట్టాన్ని ప్రస్తావిస్తూ.. 2015-16లో పార్లమెంటు రాజ్యాంగ సవరణతో చట్టం చేసిందని, రికార్డు ప్రకారం మొత్తం లోక్సభ ఏకగ్రీవంగా ఓటు వేసిందని గుర్తుచేశారు. రాజ్యసభలో ఏకగ్రీవం కాగా, ఒక్కరు గైర్హాజరయ్యారన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన ఎన్జేఏసీ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి.. ఈ సభలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, మీరంతా న్యాయపరంగా ఉన్నత వర్గమని, ఆలోచనాపరులు, మేధావులని, దయచేసి ప్రపంచంలో ఒక రాజ్యాంగ నిబంధనను రద్దు చేసిన సందర్భం ఉంటే చెప్పాలని కోరారు. నవంబర్ 26న ఢిల్లీలో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలోనూ ఉపరాష్ట్రపతి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.