పార్లమెంటు సమావేశాలకు ముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విస్ట్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో పాస్ అయ్యేలా చూడాలంటూ పార్టీలకు పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పార్లమెంటు పనిచేస్తున్న తీరుపై కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజాప్రతినిధులకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడంతో పాటు సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే ప్రిసైడింగ్ ఆఫీసర్కు కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీ యూనివర్శిటీలో ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన... రెండు సభల్లో ఏడాదిలో కనీస సిట్టింగ్లను ఫిక్స్ చేయాలని సూచించారు. అదే సమయంలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీల పదవీకాలం పొడిగించాలని సూచించారు.
ప్రస్తుతం పార్లమెంటులో మహిళా ప్రజాప్రతినిధులు 13శాతం ఉన్నారని చెప్పిన వెంకయ్యనాయుడు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చేలా అన్ని పార్టీలు కృషి చేయాలని చెప్పారు. లోక్సభలో అసెంబ్లీలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని వెంకయ్య చెప్పారు. కొన్ని ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2010లో రాజ్యసభలో ఒకసారి బిల్లు పాస్ కాగా ఇక లోక్సభలో పెండింగ్లో ఉందని తెలిపారు. నవంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల ముందు వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సానుకూలంగా ఉండగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించ లేదు.
ప్రతి ఏటా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను మార్చడం నిలిపివేసి కమిటీల్లో వ్యక్తులను వారి అకడెమిక్ ఆధారంగా అదే కమిటీల్లో మరికొంతకాలం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వెంకయ్య సూచించారు. హౌజ్లో నిబంధనలకు కట్టుబడి ఉండేలా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని చెప్పిన వెంకయ్య ఇందుకు కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకురావాలని చెప్పారు. సభకు అంతరాయం కలిగేలా వ్యవహరించే అభ్యర్థులపై వెనువెంటనే చర్యలు తీసుకునేలా ప్రిసైడిండ్ ఆఫీసర్కు అధికారాలు కట్టబెట్టాలని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇక తమ పార్టీ నుంచి కనీసం 50శాతం మంది ప్రజాప్రతినిధులు పార్లమెంటు లేదా అసెంబ్లీ సమావేశాలకు ప్రతిరోజూ హాజరయ్యేలా పార్టీ అధినేతలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.