ఎంపీ ఇంటికెళ్లి షాక్ తిన్న వెంకయ్యనాయుడు! ఏం జరిగిందంటే...
బెంగళూరు: గుడి దగ్గరో.. లేదంటే ఇంకేదైనా రద్దీ ప్రదేశం దగ్గరో చెప్పులు పోయాయంటే అందులో వింత ఏమీ లేదు. కానీ ఓ ఎంపీ ఇంటి వద్దే పోతే, అవి సాక్షాత్తు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడివి అయితే!
అవును.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి చెప్పులు పోయాయి. ఎక్కడో గుడి దగ్గర కాదు.. బెంగళూరులో బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఇంటి వద్ద. అసలేం జరిగిందంటే... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం బెంగళూరులో గంటన్నరపాటు జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగొచ్చారు.
అనంతరం అల్పాహారం నిమిత్తం మర్యాదపూర్వకంగా బెంగళూరులోని బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో వెంకయ్యనాయుడితోపాటు కేంద్రమంత్రి సదానంద గౌడ, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
దాదాపు గంటన్నరపాటు వారితో భేటీ అయిన తర్వాత తిరిగి వెళ్లిపోయేందుకు బయటికొచ్చిన వెంకయ్య నాయుడు షాక్ తిన్నారు. అక్కడ ఆయన విడిచిన చెప్పులు కనిపించలేదు. బహుశా ఎవరైనా పొరపాటున తన చెప్పులు వేసుకుని వెళ్లి ఉంటారని ఆయన భావించారు.
ఈలోగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయని తెలుసుకున్న సిబ్బంది సమీపంలోని చెప్పుల దుకాణానికి వెళ్లి కొత్త చెప్పులు కొని తీసుకొచ్చారు. దీంతో వాటిని వేసుకుని, తిరిగి తన మిగతా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెంకయ్య బయల్దేరారు.