జాతీయగీతం టైంలో శాల్యూట్ చేయని అన్సారీ: విమర్శలు, వివరణ
న్యూఢిల్లీ: రాజ్పథ్లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన సమయంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శాల్యూట్ చేయక పోవడం పైన సామాజిక మాధ్యమాల్లో సోమవారం నాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలు విమర్శలు వచ్చాయి.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మూడు రంగుల జెండాకు శాల్యూట్ చేశారు. ఉపరాష్ట్రపతి సాధారణంగా నిలబడి ఉన్న ఫోటోలు గణతంత్ర వేడకలు ముగిసిన కాసేపటికే ట్విట్టర్లో హల్ చల్ చేశాయి.
దీనిపై హమీద్ అన్సారీ కార్యాలయం వెంటనే స్పందించింది. జాతీయ గీతాలాపన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం ఉపరాష్ట్రపతి శాల్యూట్ చేయవలసిన అవసరం లేదని అందులో తెలిపింది.
ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమంలో ప్రధాన హోదాలో ఉన్నవారు, యూనిఫారంలో ఉన్న వ్యక్తులు జాతీయ గీతాలాపన సమయంలో శాల్యూట్ చేయాలని పేర్కొన్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్నవారు సావధానంలో నిలబడితే చాలని వివరణ ఇచ్చారు. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో రాష్ట్రపతి శాల్యూట్ చేశారు. ఉప రాష్ట్రపతి చేయాల్సిన అవసరం లేదని వివరించారు.