శభాష్ శ్రీరాం: పెద్దపల్లి వైద్యుడికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు
పెద్దపల్లి వైద్యుడు డాక్టర్ శ్రీరాంను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. కరోనా వైరస్తో చనిపోయిన మృతుడి భౌతికకాయం తరలించి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు మంగళవారం ట్వీట్ చేశారు. మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించిన.. వైద్యుడు స్వయంగా ట్రాక్టర్ నడపి శ్మశాన వాటికకు తీసుకెళ్లడాన్ని కొనియాడారు. డాక్టర్ శ్రీరామ్ చొరవ సమాజానికి స్పూర్తిదాయకం కావాలని ఆయన ఆకాంక్షించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వాస్పత్రిలో ఓ కరోనా పేషెంట్ మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన మున్సిపల్ సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. ఆస్పత్రి సిబ్బంది వారికి ఫోన్ చేసినా స్పందించలేదు. ఐసోలేషన్ వార్డు నుంచి మృతదేహాన్ని తరలించాలని పేషెంట్లు కోరారు. అయితే అక్కడే గల డ్రైవర్ మాత్రం తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో కరోనా నియంత్రణ కోసం నియమించిన జిల్లా ప్రత్యేక వైద్యాధికారి శ్రీరామ్ స్పందించారు. ఆయనే స్వయంగా మృతదేహం గల ట్రాక్టర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.
ఆస్పత్రి సిబ్బంది సాయంతో మున్సిపల్ వాహనంలో మృతదేహాన్ని ఎక్కించారు. అక్కడినుంచి తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ శ్మశానానికి తరలించారు. అక్కడ దహన సంస్కారాలు పూర్తి చేసి వచ్చారు. వైద్యుడు శ్రీరామ్ స్పందన పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. శ్రీరాం తన మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు. శ్రీరామ్ చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని ఆయన అభిలషించారు.
కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన పెద్దపల్లి జిల్లా (తెలంగాణ) కరోనా నిఘా అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరాం గారి చొరవను అభినందిస్తున్నాను. #Respect https://t.co/kfGbYmtNgd
— Vice President of India (@VPSecretariat) July 14, 2020