ఎస్పీ బాలుకి ప్రముఖుల నివాళి .. ఉపరాష్ట్రపతి వెంకయ్యతో పాటు తెలుగురాష్ట్రాల సీఎంలు
తన గాన మాధుర్యంతో ప్రకృతి కూడా పరవశింప చేసిన సమ్మోహన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాది వేస్తే ఆ పునాది పై అద్భుతమైన సంగీత సౌధాన్ని నిర్మించిన ఘనత ఎస్పీ బాలసుబ్రమణ్యంకే దక్కుతుంది. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈరోజు తుది శ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు .
ఎస్పీ బాలు ఇక లేరు .. శోక సంద్రంలో అభిమానులు... ఇంటివద్ద భారీగా పోలీసులు
ఆవేదన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి ... ఇలా జరుగుతుంది అనుకోలేదంటూ
ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదున్నర దశాబ్దాల నుండి అమృత గానంతో ప్రజలని అలరింపజేసిన బాలసుబ్రమణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన పేర్కొన్నారు. వారు కోలుకుంటారని సంతోషించాం అని అంతలోనే ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాటి నుండి నేటి వరకు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తున్నా అని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వెంకయ్య నాయుడు
పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారని సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకరం అంటూ పేర్కొన్నారు .వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాఅని తెలిపారు. వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు వేలాది మంది యువగాయకుల గళాలను వెలుగులోకి తీసుకు వచ్చారంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని అంటున్నారు .
ఆయన లేని లోటు తీర్చలేనిది అన్న సీఎం జగన్ , కేసీఆర్ లు
సంగీత ప్రపంచ మేరునగధీరుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిసంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సినీ ప్రపంచంలో ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎన్నో సుమధుర మధుర గేయాలు ఆలపించారని , భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారని పేర్కొన్నారు సీఎం కేసీఆర్ . ఎస్పీ బాలు ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమని అన్నారు . ఎస్పీ బాలసుబ్రమణ్యం లేని లోటు తీర్చలేనిదని తెలంగాణా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు . గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ లోకానికి ఎనలేని సేవలు చేసిన గొప్ప వ్యక్తి ఎస్పీ బాలు అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు తెలంగాణా సీఎం కేసీఆర్ .