వెంకయ్య నాయుడుకు కరోనా - ఐసోలేషన్లోకి ఉపరాష్ట్రపతి
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును సైతం కరోనా మహమ్మారి తాకింది. స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వెంకయ్య కార్యాలయం మంగళవారం వెల్లడించారు.
ఎలాంటి లక్షణాలు లేకుండానే తానకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిందని, డాక్టర్ల సూచన మేరకు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నానని వెంకయ్య తెలిపారు. కాగా, వెంకయ్య భార్య ఉషా నాయుడుకు కూడా కరోనా వైరస్ పరీక్ష జరుపగా నెగటివ్గా తేలిందని వైస్ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ ట్విట్టర్లో తెలిపింది.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ బారినపడ్డారు. అసాధారణ రీతిలో ఏర్పాట్లు చేసినప్పటికీ, ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 30 మందికిపైగా ఎంపీలు, 50మందివరకు సిబ్బందికి వైరస్ సోకడంతో సమావేశాలను అర్థాంతరంగా నిలిపేసి, ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయడం తెలిసిందే.
Recommended Video
కరోనా కారణంగా ఇప్పటికే కేంద్ర మంత్రి సురేశ్ అంగడి, కన్యాకుమారి ఎంపీ వసంతకుమార్, తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. వివిధ రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మహమ్మారి కాటుకు బలయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 70,589 కేసులు, 776 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి వరకు దేశంలో కేసుల సంఖ్య 62 లక్షలకు, మరణాలు 97వేలకు చేరువయ్యాయి.