భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యకు స్వల్ప అస్వస్థత,ఎయిమ్స్లో చేరిక
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి, తెలుగుతేజం ముప్పవరపు వెంకయ్యనాయుడు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు.
ప్రస్తుతం ఓ డాక్టర్ల బృందం వెంకయ్య నాయుడుకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను ఈ రాత్రికి ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వెంకయ్య ఆరోగ్యానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యకు బిపి, షుగర్ లెవల్స్ పెరగడంతో శుక్రవారం ఉదయం ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. శనివారం ఉదయమే ఆయన తిరిగి ఇంటికి రానున్నారని వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులు చెప్పారు.
ముందుగా అనుకున్న ప్రకారమే ఆయన ఆసుపత్రిలో చేరారని, ఆయనకు అనారోగ్య సమస్యలేమీ లేవని ఉపరాష్ట్రపతి కార్యాలయవర్గాలు తెలిపాయి. నెలకొకసారి ఎయిమ్స్కు వెళ్లి వెంకయ్య ఆరోగ్య పరీక్షలను చేయించుకుంటారు.
అందులో భాగంగానే శనివారం ఉదయం వెళ్లగా కొంచెం షుగర్, బిపి లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా ఆయన కొద్దిగా అలసటగా కూడా ఉండటంతో ఒకరోజు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం మంచిదని ఆయన వ్యక్తిగత డాక్టర్ రాధోర్ సూచించారు. దీంతో శుక్రవారమంతా ఎయిమ్స్లోనే వెంకయ్యనాయుడు గడపనున్నారు.