కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు: వెంకయ్య గెలుపు లాంఛనమే
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే పోలింగ్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓట్లు వేయనున్నారు.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం నుంచీ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరిగే పోలింగ్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓట్లు వేయనున్నారు. తమకు నచ్చిన అభ్యర్థి పేరుపై మార్కింగ్ చేసేందుకు పార్లమెంటుసభ్యులు ప్రత్యేక కలాల(పెన్నులు)ను వినియోగిస్తున్నారు.
అధికార ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీఏకి తగిన సంఖ్యా బలం ఉన్నందున వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనం కానుంది.
కాగా, పార్లమెంటు ఉభయసభల్లో మొత్తం సభ్యులు 790 మంది కాగా లోక్సభలో రెండు ఎంపీ స్థానాలు, రాజ్యసభలో ఒక ఎంపీ స్థానం ఖాళీగా ఉన్నాయి. కోర్టు తీర్పు కారణంగా బీజేపీ లోక్సభ ఎంపీ సీహెచ్ పాసవాన్ ఓటింగ్లో పాల్గొనలేరు. పోలైన చెల్లుబాటు ఓట్లలో 50శాతానికి పైగా పొందిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.
545 మంది సభ్యులున్న లోక్సభలో ఎన్డీయే బలం 335 (బీజేపీ ఎంపీలు281). 243 మంది సభ్యులున్న రాజ్యసభలో ఈ కూటమి బలం దాదాపు 75 (బీజేపీ ఎంపీలు 56). ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలూ ఎన్డీకే మద్దతిస్తున్నారు. దీంతో వెంకయ్యనాయుడే కాబోయే ఉపరాష్ట్రపతి అని చెప్పవచ్చు. కాగా, పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రం 7గంటల కల్లా ఫలితాన్ని వెల్లడిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఓటు వేసిన మోడీ
పార్లమెంట్లో జరుగుతున్న ఈ పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. మోడీతో పాటు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఉదయం ఓటువేశారు. యోగి ఆదిత్యనాథ్ ఇంకా ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.